ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్నాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. వేద మంత్రోచ్ఛారణలు, శంఖారావాల మధ్య బాబా కేదార్నాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకోవడంతో చార్ధామ్ యాత్రలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈ మేరకు ఆలయాన్ని దాదాపు 51 క్వింటాళ్ల వివిధ రకాల స్వదేశీ, విదేశీ పూలతో అత్యంత శోభాయమానంగా అలంకరించారు. ఆలయ ద్వారాలు తెరుచుకున్న సమయంలో వేలాది మంది భక్తులు చేసిన ‘హరహర మహాదేవ్’, ‘జై కేదార్’ నినాదాలతో హిమాలయ పర్వత శ్రేణులు మార్మోగిపోయాయి.
ఈ ఏడాది చార్ధామ్ యాత్రకు గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తుల నుంచి భారీ స్పందన కనిపిస్తోంది. కేదార్నాథ్తో పాటు బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి దర్శనం కోసం ఇప్పటి వరకు దాదాపు 15 లక్షల మందికి పైగా భక్తులు ఆన్లైన్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉత్తరాఖండ్ ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా కేదార్నాథ్ మార్గంలో ఇంకా మంచు కురుస్తున్న నేపథ్యంలో యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంది. అలాగే యమునోత్రి, గంగోత్రి ధామ్ల దర్శనం కూడా ప్రారంభమవడంతో ఉత్తరాఖండ్లో చార్ధామ్ యాత్ర సందడి నెలకొంది.