మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం కేంద్రంగా ఆదివాసీలు తమ గళాన్ని వినిపించారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి (ఏహెచ్పీఎస్) తుడుం దెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆదివాసీ పోరుకేక’ భారీ బహిరంగ సభకు రాష్ట్రంలోని వివిధ ఏజెన్సీ ప్రాంతాల నుండి వేలాది మంది ఆదివాసీలు తరలివచ్చారు.
సభకు ముఖ్య అతిథులుగా హాజరైన తొమ్మిది తెగల సమన్వయకర్త & చైర్మన్ చుంచు రామకృష్ణ, ఆదివాసీ తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ ముందుగా కొమురం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సంప్రదాయ డోలు వాయిద్యాలు, గిరిజన నృత్యాల నడుమ జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు.
ఈ సందర్భంగా డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు గడుస్తున్నా ఆదివాసీల జీవితాల్లో ఆశించిన మార్పులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు, ప్రభుత్వాలు మారుతున్నా ఆదివాసీ బతుకులు మారడం ఆయన విమర్శించారు. అడవిని కాపాడిన ఆదివాసీ నేడు తన హక్కుల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను స్థానిక ఆదివాసీ యువతతోనే భర్తీ చేయాలని, కేవలం మెగా డీఎస్సీ కాకుండా, ప్రత్యేకంగా ‘ఏజెన్సీ డీఎస్సీ’ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చదువుకున్న గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు.
తరతరాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూములకు ఇప్పటికీ పూర్తి హక్కులు లేవని, వెంటనే పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
గిరివికాస్ బోర్డులను మంజూరు చేయాలని, ఆదివాసీ రైతులకు నీరు, భూమి మరియు సాగు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
షెడ్యూల్ తెగల జాబితా నుండి 1976 అప్పటి కాంగ్రెస్ పార్టీ సంచార జాతులైన లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చి మా బతుకులను చీకటి చేర్చారని వీరిని చేర్చడం వలన ప్రభుత్వం వచ్చే అన్ని పథకాలకు నిజమైన ఆదివాసులను నష్టపోతున్నామని న్యాయబద్ధంగా వారిని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు జూలై 31 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసి సంఘాలను ఆహ్వానించి చర్చలు జరుపకుంటే ఆదివాసీల సత్తా ఏంటో పాలక ప్రభుత్వానికి రుచి చూపిస్తామని ఆదివాసి సంఘాలు హెచ్చరించాయి.




Total views : 92595