తెలంగాణ ప్రభుత్వం భూములు, ప్లాట్లు, ఫ్లాట్ల మార్కెట్ విలువల సవరణకు ఆమోదం తెలిపింది. కొత్త మార్కెట్ విలువలు ఈ నెల 5వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. క్షేత్రస్థాయి అధ్యయనం, మార్కెట్ ధరలు, రిజిస్ట్రేషన్ల ధోరణి, డిమాండ్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలోని 144 సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో భూముల మార్కెట్ విలువలు పెరిగాయి. ఔటర్ రింగ్ రోడ్ రీజినల్ రింగ్ రోడ్ , అభివృద్ధి కారిడార్లు వంటి ప్రాజెక్టుల ప్రభావాన్ని కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. ఈ ప్రాంతాల్లో భూముల విలువలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో మార్కెట్ విలువలను సవరించింది. ఫ్లాట్ల మార్కెట్ విలువల్లో ఉన్న అసమానతలను తొలగించేందుకు హేతుబద్ధీకరణ చేపట్టింది. కొన్ని ప్రాంతాల్లో అన్ని అంతస్తుల ఫ్లాట్లకు ఒకే మార్కెట్ విలువను అమలు చేయాలని నిర్ణయించింది. అలాగే HMDA, CURE, ఇతర ప్రాంతాలకు కనీస ప్రాథమిక మార్కెట్ రేట్లను నిర్ణయించింది.
వ్యవసాయ భూములు, ప్లాట్లు, ఫ్లాట్లకు కొత్త కనీస మార్కెట్ విలువలను ఖరారు చేయడంతో పాటు నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణ రేట్లను కూడా సవరించింది. ఆర్సీసీ, నాన్-ఆర్సీసీ నిర్మాణాలకు సంబంధించిన విలువల్లో మార్పులు చేసింది. భూ లావాదేవీల్లో పారదర్శకతను పెంచడం, మార్కెట్ ధరలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ విలువలను నిర్ణయించడం ఈ సవరణల ప్రధాన లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.





Total views : 92310