తెలంగాణ పోలీస్ శాఖలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి బందోబస్తు విధులు ముగించుకుని వస్తున్న ఒక పోలీస్ కానిస్టేబుల్ను పిడుగు రూపంలో మృత్యువు కబళించింది. నాగర్కర్నూల్ జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన తోటి పోలీస్ సిబ్బందిని, స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం ఉల్పారా గ్రామానికి చెందిన మద్దమల్ల రాజు కానిస్టేబుల్గా నాగర్కర్నూల్ ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. గత రెండు రోజులుగా ముఖ్యమంత్రి బందోబస్తు విధులలో భాగంగా ఆయన సోమశిలలో సేవలు అందించారు. సీఎం బందోబస్తు విధులను ముగించుకుని ఆయన తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో మామిళ్లపల్లి గ్రామం సమీపంలోకి రాగానే ఒక్కసారిగా ఆకస్మికంగా పిడుగు పడింది. ఈ ఘోర ప్రమాదంలో కానిస్టేబుల్ రాజు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న ఉప్పునుంతల పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. రాజు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
నాగర్కర్నూల్ జిల్లాలో పిడుగుపాటుకు ఏఆర్ కానిస్టేబుల్ దుర్మరణం.
233