జోగులాంబ గద్వాల జిల్లాలోని రైతులకు జీవనాడిగా భావించే రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ అంశం మరోసారి ప్రాధాన్యత సంతరించుకుంది. కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఇంజనీర్ల బృందం పరిశీలించి, మూడు రాష్ట్రాల అధికారులతో కీలక సమీక్ష నిర్వహించింది. ఆనకట్ట మరమ్మతులు, నీటి విడుదల, పెండింగ్ పనులతో పాటు అక్రమ నీటి వినియోగంపై చర్చ జరిగింది.ఆనకట్ట నుంచి కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు విడుదల అవుతున్న నీటి పరిస్థితిని అధికారులు సమీక్షించారు.ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద పెండింగ్లో ఉన్న పనులు, ప్రధాన కాల్వ మరమ్మతులు, కాల్వల నిర్వహణ, ఆనకట్టను బ్యారేజీగా మార్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అలాగే ఆర్డీఎస్ను తుంగభద్ర బోర్డు పరిధిలోకి తీసుకురావడానికి అనుసరించాల్సిన విధివిధానాలపై మూడు రాష్ట్రాల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అక్రమంగా నీటి చౌర్యానికి పాల్పడుతున్నాయని ఆరోపణలు కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి. ఆర్డీఎస్ ప్రాజెక్టు మాజీ చైర్మన్ తనగల సీతారాం రెడ్డి మాట్లాడుతూ.. గత 75 ఏళ్లుగా ఈ ప్రాజెక్టుకు అన్యాయం జరుగుతోందని కేఆర్ఎంబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.తెలంగాణకు కేటాయించిన 15.9 టీఎంసీల నీరు పూర్తిస్థాయిలో అందడం లేదని, ఆనకట్టలో సిల్ట్ పేరుకుపోవడం, వరదల కారణంగా దెబ్బతినడం, ప్రధాన కాల్వలకు లైనింగ్ లేకపోవడంతో 87 వేల 500 ఎకరాలకు సాగునీరు సక్రమంగా అందడం లేదని వివరించారు.





Total views : 146788