గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు పుష్కరాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా 8 నుంచి 10 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. పుష్కరాల కోసం రూ.4,026 కోట్లతో 4,932 పనులు చేపడుతున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మొత్తం 440 ఘాట్లను సిద్ధం చేస్తున్నారు. ఇందులో 259 పాత ఘాట్లను అభివృద్ధి చేయడంతో పాటు 181 కొత్త ఘాట్లను నిర్మించనున్నారు.
భక్తుల రద్దీ నియంత్రణ, భద్రత కోసం అధునాతన సాంకేతికతను వినియోగించనున్నారు. ఏఐ క్రౌడ్ అనలిటిక్స్, సీసీ కెమెరాలు, డ్రోన్లు, క్యూఆర్ ఆధారిత వాహన గుర్తింపు వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. అత్యవసర వైద్య సేవల కోసం 30 తాత్కాలిక ఫీల్డ్ ఆస్పత్రులను అందుబాటులో ఉంచనున్నారు. అలాగే 2,697 రెస్క్యూ బోట్లు, 8,955 మంది శిక్షణ పొందిన ఈతగాళ్లను సిద్ధంగా ఉంచనున్నారు. పుష్కరాలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం చంద్రబాబు సూచించారు.