అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మరోసారి భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 105 నుంచి 107 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది. WTI క్రూడ్ కూడా 101 డాలర్ల మార్కును దాటింది. పశ్చిమాసియాలో అమెరికా–ఇరాన్ మధ్య ముదిరిన యుద్ధ వాతావరణం, చమురు సరఫరాకు ఏర్పడుతున్న అంతరాయాల భయాలతో గత కొద్దిరోజులుగా ధరలు వరుసగా పెరుగుతున్నాయి. భారత్ దిగుమతి చేసుకునే ఇండియన్ బాస్కెట్ ధర కూడా 116 డాలర్లకు చేరడం ఆందోళన కలిగిస్తోంది.
హార్ముజ్ జలసంధి చుట్టూ నెలకొన్న ఉద్రిక్తతలు క్రూడ్ ధరలకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. నౌకలపై పరస్పర దాడులు, అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణి దాడులు, సౌదీ అరేబియాలోని ఎనర్జీ ప్లాంట్లపై దాడులతో సరఫరా భయాలు పెరిగాయి. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హార్ముజ్ మార్గంలో రాకపోకలు దెబ్బతినడంతో.. ప్రపంచ చమురు మార్కెట్ చరిత్రలోనే భారీ సప్లై అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే బ్రెంట్ క్రూడ్ 120 డాలర్లకు చేరే అవకాశం ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. చమురు ధరల పెరుగుదల ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ భయాలను పెంచుతోంది. దీంతో అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లపైనా ఒత్తిడి పెరుగుతోంది. భారత్ కూడా భారీగా చమురు దిగుమతులపై ఆధారపడుతున్న నేపథ్యంలో.. పెట్రోల్, డీజిల్ ధరలపై ఒత్తిడి, దిగుమతి బిల్లు పెరుగుదల, రూపాయి విలువపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలున్నాయి.