ఏపీ సీఎం చంద్రబాబు మరో అరుదైన జాతీయస్థాయి గౌరవాన్ని అందుకోబోతున్నారు. ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025’ అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న విధానాలకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. ఈ అవార్డును అందుకునేందుకు మధ్యాహ్నం ముంబైకి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే రాష్ట్రానికి దాదాపు 20 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులను తీసుకురావడం ఈ అవార్డు ఎంపికలో కీలక పాత్ర పోషించింది.
ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఇవాళ సాయంత్రం 5:30 నుంచి 7:30 గంటల మధ్య ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ దిగ్గజాల సమక్షంలో చంద్రబాబు ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. గతంలో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అరుణ్ జైట్లీ, పీయూష్ గోయల్, నితీష్ కుమార్, అశ్వినీ వైష్ణవ్, ఎస్. జై శంకర్ వంటి ప్రముఖులు అందుకున్నారు. చంద్రబాబు ఇప్పుడు వారి జాబితాలో చేరనున్నారు.