కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య సంచలన ప్రకటన చేశారు. తాను 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని, ఎన్నికల రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతున్నానని స్పష్టం చేశారు. అయితే, ప్రజా జీవితంలోనే కొనసాగుతూ ప్రజల పక్షాన తన గొంతు వినిపిస్తూనే ఉంటానని ఆయన తెలిపారు. మండ్య జిల్లాలోని కే.ఆర్. పేట పట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో మద్దతుదారులను ఉద్దేశించి సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు ప్రస్తుతం అత్యంత కలుషితమయ్యాయని…. నిజాయతీతో కూడిన రాజకీయాలు మనుగడ సాగించే పరిస్థితి లేదన్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నానని తెలిపారు. 2028 నాటికి తన వయసు 82 ఏళ్లకు చేరుకుంటుందని, అప్పుడు ఇప్పుడున్నంత ఉత్సాహంగా, ఆరోగ్యంగా పనిచేయలేకపోవచ్చని పేర్కొన్నారు. ఈ ప్రకటనతో అక్కడున్న మద్దతుదారులు, కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురయ్యారు. మరో పదేళ్ల పాటు క్రియాశీల రాజకీయాల్లోనే ఉండాలని వారు సిద్ధరామయ్యను కోరారు. అయినప్పటికీ, ఆయన తన నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, సిద్ధరామయ్య తన నిర్ణయాన్ని ఆదివారం ‘ఎక్స్’ వేదికగా మరోసారి ధ్రువీకరించారు.
సిద్ధరామయ్య రెండు పర్యాయాలుగా మొత్తం ఎనిమిదేళ్లకు పైగా కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసి, రాష్ట్ర చరిత్రలో ఎక్కువ కాలం సీఎం పదవిలో ఉన్న నేతగా రికార్డు సృష్టించారు. 2013 నుంచి 2018 వరకు పూర్తి ఐదేళ్ల పాటు, ఆ తర్వాత 2023 నుంచి 2026 వరకు రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన గతంలో 2013, 2018, 2024 ఎన్నికల సమయంలోనూ ఇలాంటి ప్రకటనలు చేసినప్పటికీ, తాజా వ్యాఖ్యలతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై మరోసారి చర్చ మొదలైంది.