తమిళనాడులో పదేళ్ల బాలికపై జరిగిన దారుణ హత్యోదంతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. చిన్నారి హత్యపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. ఈ ఘటనపై తమిళనాడు సీఎం Vijay తీవ్రంగా స్పందించారు. ఘటనను అత్యంత సీరియస్గా తీసుకున్న సీఎం విజయ్.. వెంటనే సమగ్ర దర్యాప్తు చేపట్టాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దని.. కఠిన చర్యలు తీసుకుని వేగంగా అరెస్ట్ చేయాలని స్పష్టం చేశారు. అలాగే కేసు విచారణను ఫాస్ట్ట్రాక్ పద్ధతిలో ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని.. వారికి పూర్తి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. చిన్నారుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది.ఈ దారుణ ఘటనపై రాష్ట్రంలోని పలు రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలు, బాలల హక్కుల సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ పలు ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉంటే.. ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫోరెన్సిక్ ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్, అనుమానితుల వివరాలను సేకరిస్తున్నారు. ఈ కేసును అత్యంత ప్రాధాన్యతతో విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.చిన్నారి హత్య ఘటనతో తమిళనాడులో మహిళలు, బాలికల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని సామాజిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Tag:






Total views : 89157