భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కావడం ఎప్పుడూ తనకు గర్వకారణమని, అది ఒక భావోద్వేగపూరితమైన అనుభూతిని ఇస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. ప్రధానిని కలిసిన తర్వాత తనలో మరింత శక్తి, బాధ్యత పెరిగాయని వెల్లడించారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ భేటీలో భాగంగా తెలంగాణలోని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఘన విజయంపై ప్రధాని మోదీ ప్రత్యేకంగా చర్చించారు. ఈ ఎన్నికల ఫలితాల పట్ల ప్రధాని తన సంతోషాన్ని వ్యక్తం చేసినట్లు బండి సంజయ్ తెలిపారు.
ప్రధానితో సమావేశం తనలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని ఆయన పేర్కొన్నారు. ప్రతిసారీ ప్రధాని మోదీని కలిసినప్పుడు, తాను మరింత శక్తితో, బాధ్యతాయుతమైన సంకల్పంతో తిరిగి వస్తుంటానని అన్నారు. దేశానికి సేవ చేయాలనే తన నిబద్ధతను మోదీ మాటలు మరింత బలోపేతం చేశాయని తెలిపారు. తెలంగాణలో బీజేపీ సిద్ధాంతాలను, పార్టీ మిషన్ను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలనే లక్ష్యానికి ప్రధాని సూచనలు గొప్ప ప్రేరణనిచ్చాయని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలను ముమ్మరం చేసేందుకు ఈ భేటీ ఎంతో దోహదపడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Tag:




Total views : 141629