తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వల్లే తనకు గుర్తింపు వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ లేకపోతే తాను చేసిన మంచి పనులు ప్రజలకు తెలిసేవి కాదని చెప్పారు. రావణుడి చెడు వల్లే రాముడి గొప్పతనం తెలిసిందని చెప్పుకొచ్చారు. మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ముఖ్యమంత్రి పలు కీలక అంశాలపై మాట్లాడారు. కేసీఆర్ విశ్రాంతి తీసుకొంటున్నారని అందరూ అంటున్నారని.. ఆయన్ను గృహ నిర్బంధం చేశారని తనకు అనుమానంగా ఉందన్నారు. దేశంలో నియోజకవర్గాల పునర్విభజనపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఏదేదో మాట్లాడుతున్నారని.. తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెడతామని ఆయన అంటున్నారని మండిపడ్డారు. మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్టరా? అంటూ ప్రశ్నించారు. నియోజకవర్గాల పునర్విభజనను 50 శాతం సీట్ల ప్రాతిపదికన చేస్తే దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ దీనిపై వితండవాదం చేస్తున్నారని ఆగ్రహించారు. 50 శాతం సీట్లు పెంచుతున్నామని చెప్పినా ఉత్తర భారతదేశానికి నేరుగా లాభం జరుగుతుందని ఆరోపించారు రేవంత్ రెడ్డి. రాజకీయంగా అవసరం ఉన్నప్పుడే సౌత్ ఇండియాను పట్టించుకోవడం లేదని.. ఇక నియోజకవర్గాల పునర్విభజన జరిగితే సౌత్ ఇండియా అవసరం లేకుండా పోతుందని విమర్శించారు.
ఇక నేటి నుంచి రెండు రోజుల పాటు తాను కేరళలో ఎన్నికల ప్రచారం చేయనున్నట్లు రేవంత్ తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ త్వరలో క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తామని భరోసా కల్పించారు రేవంత్ రెడ్డి. పంట మార్పిడి విషయంలో రైతులపై ఒత్తిడి తీసుకురామని.. వారికి అవగాహన కల్పిస్తామని తెలిపారు. పేదలకు ఇచ్చే సన్న బియ్యం కోసం రూ.14,560 కోట్లు ఖర్చు పెడుతున్నామని, దాంట్లో కోతలు పెట్టమని స్పష్టం చేశారు. సన్న బియ్యం పక్కదారి పట్టడం లేదని తెలిపారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్న బియ్యంతో అసెంబ్లీలో అందరికీ మంచి భోజనం పెట్టారన్నారు. పేదలందరికీ ప్రభుత్వ పథకాలు కచ్చితంగా అందుతాయని పేర్కొన్నారు ముఖ్యమంత్రి. వరి వేస్తే ఉరే అని కేసీఆర్ అన్నారని.. తాము మాత్రం వరి వేస్తే బోనస్ ఇస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు.




Total views : 141746