అమెరికా-ఇరాన్ వరుస దాడులతో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఐతే తాజాగా ఈ రెండు దేశాలు ఓ కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇటీవల కుదిరిన శాంతి ఒప్పందంపై నీలినీడలు కమ్ముకున్న నేపథ్యంలో ఇరు దేశాలు పరస్పరం దాడులు ఆపాలని నిర్ణయించాయి. ఖతార్ వేదికగా రేపు ఉన్నతస్థాయి చర్చలు జరపాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కుదిరిన ఒప్పందాన్ని కాపాడుకునేందుకు ఇరుదేశాలు చొరవ చూపినట్లు వార్తలొస్తున్నాయి.
హర్మూజ్ విషయంలో చర్చలు కొనసాగుతున్నంత కాలం దాడులు చేసుకోవద్దని ఇరు దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. మిలిటరీ కార్యకలాపాలను వెంటనే ఆపేందుకు ఇరు దేశాలు అంగీకరించినట్లు తెలిపారు అమెరికా సీనియర్ అధికారులు. హర్మూజ్ విషయంలో సాంకేతిక చర్చలు జరుగుతున్నప్పటికీ..ఆ జలసంధిలో నౌకలు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వేచ్ఛగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తాయని వెల్లడించారు.
అమెరికా, ఇరాన్ల మధ్య ఇటీవల శాంతి ఒప్పందం కుదరడంతో కీలకమైన హర్మూజ్లో చమురు రవాణా తిరిగి ప్రారంభమైంది. అయితే రెండు రోజుల క్రితం ఇరాన్ బలగాలు.. చమురుతో వెళుతున్న వాణిణ్య నౌకపై డ్రోన్లతో దాడికి దిగాయి. వాటిలో ఒక డ్రోన్ కార్గో షిప్ను ఢీకొట్టింది. దీంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ధిక్కరించినందుకు అమెరికా ప్రతీకార దాడులు చేసింది. ఆ దేశ క్షిపణులు, డ్రోన్ల నిల్వ కేంద్రాలపై యుద్ధవిమానాలతో విరుచుకుపడింది. ఇరాన్ సైతం గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై దాడి చేసింది. రెండు రోజుల పాటు ఇరుదేశాలు పరస్పరం దాడులకు దిగడంతో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులేర్పడ్డాయి. అయితే, నష్టనివారణ చర్యలకు దిగిన అమెరికా, ఇరాన్లు.. దాడులు మరింత పెరగకుండా, ఉద్రిక్తతలు చల్లార్చేలా నిర్ణయం తీసుకున్నాయి.





Total views : 180112