పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి, తన సొంత జీతంతో పేద విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ అందించి మరోసారి సేవాభావాన్ని చాటుకున్నారు. తొర్రూరు పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో హనుమండ్ల ఝాన్సీ రెడ్డి సహకారంతో గత 45 రోజులుగా నిర్వహించిన కంప్యూటర్ శిక్షణా కార్యక్రమం విజయవంతంగా పూర్తికాగా, శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు.
ఉద్యోగాలు, ఉన్నత విద్యలో కంప్యూటర్ పరిజ్ఞానం ఎంతో అవసరమనే ఉద్దేశంతో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తన నెలవారీ జీతంలో నుంచి నిధులు వెచ్చించి ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఎలాంటి భారం లేకుండా నాణ్యమైన శిక్షణ అందించడం అభినందనీయమని పలువురు కొనియాడారు.
ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ, ఉచితంగా కంప్యూటర్ శిక్షణతో పాటు సర్టిఫికెట్ పొందడం తమ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. తల్లిదండ్రులు కూడా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చేసిన సేవను ప్రశంసిస్తూ, పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం స్ఫూర్తిదాయకమని, ఇచ్చిన హామీని నిలబెట్టుకుని ఆచరణలో చూపించడం గొప్ప విషయమని హర్షం వ్యక్తం చేశారు.



Total views : 207683