హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్లో జరిగిన మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. అత్యంత భద్రత కలిగిన ప్రాంతంగా భావించే ఈ కాలనీలోనే ఇలాంటి దారుణం జరగడం తీవ్ర ఆందోళనకు దారి తీసింది. సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల నివాసాలు ఉండే ఈ ప్రాంతంలో పోలీసులు ఎప్పటికప్పుడు గస్తీ నిర్వహిస్తుంటారు. అయినప్పటికీ నిందితులు పథకం ప్రకారమే ఇంట్లోకి ప్రవేశించి హత్య, దోపిడీకి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలుతోంది. పోస్టుమార్టం నివేదిక ప్రకారం తనూజ ఊపిరాడకుండా చేయడంతో మృతి చెందినట్లు సమాచారం. కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు పదికి పైగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. 200కు పైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ నిందితుల కదలికలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసు కుటుంబానికే ఇలాంటి సంఘటన జరగడం వల్ల భద్రతా వ్యవస్థపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ కేసులో ప్రధాన అనుమానితురాలిగా భావిస్తున్న కల్పన అనే మహిళ పాత్రపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో పనిమనిషిగా చేరిన ఆమె ముందస్తు ప్రణాళికతోనే ఈ దోపిడీకి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వినయ్ రంజన్ రే చికిత్స కోసం బెంగళూరుకు వెళ్లిన తర్వాత ఇంటి పరిస్థితులు, భద్రతా వ్యవస్థపై పూర్తి సమాచారం సేకరించి ముఠాకు చేరవేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఘటన జరిగిన అనంతరం కల్పనతో పాటు మరో ఇద్దరు జూబ్లీహిల్స్ నుంచి ఆటోలో నాంపల్లికి చేరినట్లు సీసీటీవీ ఆధారాలు లభించాయి. అక్కడి నుంచి తెలంగాణ ఎక్స్ప్రెస్లో నాగ్పూర్ వైపు ప్రయాణించినట్లు పోలీసులు అంచనా వేశారు. అయితే మార్గమధ్యలోనే రైలు దిగి పోలీసులను తప్పుదారి పట్టించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాస్క్ఫోర్స్ బృందాలు వివిధ రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టాయి. కేసులో అంతర్రాష్ట్ర ముఠా ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది.
జూబ్లీహిల్స్ హత్య కేసు కేవలం దోపిడీ ఘటనగా కాకుండా పక్కా ప్రణాళికతో అమలు చేసిన నేరంగా పోలీసులు భావిస్తున్నారు. ఇంట్లో పనిలో చేరడం నుంచి హత్య, ఆ తర్వాత పరారీ వరకు ప్రతి దశలో నిందితులు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు ఆధారాలు కనిపిస్తున్నాయి. ఘటనాస్థలంలో స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్ల ఆధారంగా కాల్ డేటా, సంప్రదింపుల వివరాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. కల్పనతో సన్నిహితంగా ఉన్న పలువురు నేపాలీ మహిళలను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ ముఠాలో ముగ్గురా, నలుగురా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. బయట నుంచి ఆదేశాలు ప్రకారం ఈ నేరం జరిగి ఉండొచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అత్యంత భద్రత కలిగిన ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం ప్రజల్లో భయాందోళనలకు కారణమైంది. నిందితులను ఎంత త్వరగా పట్టుకుంటారు, దోపిడీ వెనుక అసలు సూత్రధారులు ఎవరు అన్నది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.





Total views : 74908