తమిళనాడు అసెంబ్లీలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. గంటల తరబడి సాగిన ఉత్కంఠకు తెరదించుతూ.. తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ నేతృత్వంలోని TVK ప్రభుత్వం బలపరీక్షలో ఘన విజయం సాధించింది. ప్రతిపక్షాల వ్యూహాలను చిత్తు చేస్తూ, ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి చరమగీతం పాడుతూ విజయ్ సర్కార్ సభలో తన మెజారిటీని నిరూపించుకుంది. దీంతో తమిళనాడులో దళపతి మార్క్ పూర్తి స్థాయి పాలనకు లైన్ క్లియర్ అయింది.
ఓటింగ్కు ముందే డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ ఆధ్వర్యంలో ఆ పార్టీకి చెందిన 59 మంది ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. దీంతో సభలో హాజరైన సభ్యుల సంఖ్య తగ్గిపోయి.. మెజారిటీ మార్క్ 88 కి పడిపోయింది. ఇది విజయ్ ప్రభుత్వానికి నల్లేరుపై నడకలా మారింది. ఇక మాజీ సీఎం పళనిస్వామి TVK ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని విప్ జారీ చేసినప్పటికీ.. ఎస్.పి. వేలుమణి, సి.వి. షణ్ముగం నేతృత్వంలోని 30 మంది ఏఐఏడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు విప్ను ధిక్కరించి విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. డీఎంకే వాకౌట్ చేయడం, AIADMK తిరుగుబాటు వర్గం మద్దతు ఇవ్వడంతో సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం చాలా సులభంగా ఈ బలపరీక్షలో నెగ్గింది.
విశ్వాస పరీక్ష ముగిసిన తర్వాత స్పీకర్ జె.సి.డి. ప్రభాకర్ అధికారికంగా విజయ్ ప్రభుత్వం నెగ్గినట్లు ప్రకటించారు. ఈ విజయంతో అసెంబ్లీ వెలుపల టీవీకే శ్రేణులు, విజయ్ అభిమానులు భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. సరిగ్గా మూడు రోజుల క్రితం సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తూనే.. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళా భద్రత ఫైళ్ళపై సంతకం చేసిన విజయ్.. ఇప్పుడు అసెంబ్లీలోనూ తన బలాన్ని నిరూపించుకుని ప్రజా ప్రభుత్వంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.
విశ్వాస తీర్మానంపై చర్చ ముగిసిన తర్వాత సీఎం దళపతి విజయ్ సభలో సమాధానమిచ్చారు. తమ ప్రభుత్వం ఖచ్చితంగా సెక్యులర్ ప్రభుత్వంగా ఉంటుందని అన్నారు. తమ ప్రభుత్వం గుర్రపు వేగంతో దూసుకుపోతుంది కానీ.. గుర్రం వ్యాపారానికి పాల్పడదు అంటూ ప్రత్యర్థులకు గట్టి కౌంటర్ ఇచ్చారు. గత ప్రభుత్వాల మంచి పథకాలన్నీ కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.




Total views : 75025