జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని గద్వాల మున్సిపాలిటీ 7వ వార్డులో ఉన్న పిల్లిగుండ్ల కాలనీ సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. దాదాపు 18 ఏళ్ల క్రితం ఏర్పడిన ఈ కాలనీలో ఇప్పటికీ కనీస మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రాకపోవడం స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సీసీ రోడ్లు లేక వర్షం పడితే బురదమయంగా మారుతున్న వీధులు… డ్రెయినేజీ లేక మురుగు నీరు నిల్వలు… తాగునీటి సమస్య… రాత్రివేళ వీధి దీపాలు లేక చీకట్లోనే జీవనం… ఇలా ప్రజల దైనందిన జీవితం కష్టాలతో సాగిపోతోంది.
ప్రభుత్వాలు మారినా గద్వాల పట్టణ పరిధిలోని పిల్లిగుండ్ల కాలనీ అభివృద్ధికి నోచుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో సరైన రోడ్లు లేక ప్రజలకు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగు నీరు వీధుల్లోనే నిల్వ ఉండి దుర్వాసన వెదజల్లుతోంది. రాత్రి వేళ వీధి దీపాలు లేక మహిళలు, వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీటి సరఫరా కూడా సక్రమంగా లేక ప్రజలు దూర ప్రాంతాల నుంచి నీరు తెచ్చుకునే పరిస్థితి నెలకొంది. కాలనీ అభివృద్ధికి ఎన్నోసార్లు అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పిల్లిగుండ్ల కాలనీలో పాఠశాల, అంగన్వాడీ కేంద్రాల కోసం స్థలం కేటాయించినప్పటికీ ఇప్పటివరకు భవన నిర్మాణాలు చేపట్టకపోవడం ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులు విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేక అత్యవసర సమయంలో ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలో శ్మశానవాటిక కూడా లేక అంత్యక్రియల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీస అవసరాలు కూడా లేకపోవడంతో నరకయాతన అనుభవిస్తున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చే నాయకులు… ఎన్నికలు ముగిసిన తర్వాత కాలనీ వైపు చూడటం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యల పరిష్కారంపై అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారని కాలనీ వాసులు మండిపడుతున్నారు.
7వ వార్డులోని దౌదర్పల్లి – పిల్లిగుండ్ల కాలనీలు గత పాలకుల నిర్లక్ష్యానికి బలయ్యాయని స్థానిక కౌన్సిలర్ జగదీశ్ ఆరోపిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా అభివృద్ధి పనులు నిలిచిపోయాయని… అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన కోరుతున్నారు. కాలనీలో సీసీ రోడ్లు, డ్రెయినేజీ, తాగునీటి సౌకర్యం, వీధి దీపాలు ఏర్పాటు చేయడంతో పాటు పాఠశాల, అంగన్వాడీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, శ్మశానవాటిక నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి పిల్లిగుండ్ల కాలనీ ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.





Total views : 78537