నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బోరు గుంతలో పడిపోయిన నాలుగేళ్ల చిన్నారిని కాపాడేందుకు వెళ్లిన తాత ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. గ్రామ శివారులోని వ్యవసాయ పొలం వద్ద ఆడుకుంటున్న బాలుడు అనుకోకుండా బోరు గుంతలో పడిపోవడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. మనవడిని రక్షించాలనే ఆతృతతో వెంకన్న అనే వ్యక్తి వెంటనే బోరు గుంతలోకి దిగాడు. అయితే, లోతైన గుంతలో ఇద్దరూ ఇరుక్కుపోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
స్థానికుల సమాచారంతో మిర్యాలగూడ రూరల్ పోలీసులు తక్షణమే ఘటనాస్థలికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. గంటలపాటు శ్రమించి తాత, మనవడిని బోరు గుంతలోంచి బయటకు తీశారు. అయితే అప్పటికే వెంకన్న తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఊపిరి ఆడక అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చిన్నారిని మాత్రం సురక్షితంగా బయటకు తీయడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.మనవడిని కాపాడే ప్రయత్నంలో తాత ప్రాణాలు కోల్పోవడంతో ఊట్లపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.





Total views : 79283