ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు భారీ ఊరట లభించింది. హర్యానాలోని గురుగ్రామ్ భూ కుంభకోణం, మనీలాండరింగ్ కేసులో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఆయనకు ఉపశమనం కలిగింది. ఇవాళ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరైన ఆయనకు ప్రత్యేక న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
హర్యానాలోని శిఖోపూర్ గ్రామంలో 2008లో జరిగిన 3.53 ఎకరాల భూ లావాదేవీల చుట్టూ ఈ వివాదం నడుస్తోంది. రాబర్ట్ వాద్రాకు చెందిన ‘స్కై లైట్ హాస్పిటాలిటీ’ సంస్థ..ఒంకార్వేగర్ ప్రాపర్టీస్ నుంచి ఈ భూమిని కొనుగోలు చేసింది. ఈ డీల్ సమయంలో తప్పుడు పత్రాలు సమర్పించారని, ఎలాంటి నగదు చెల్లించకుండా లావాదేవీలు జరిపారని ఈడీ ఆరోపించింది. అప్పటి రాజకీయ ప్రభావాన్ని ఉపయోగించి ఈ భూమికి కమర్షియల్ లైసెన్స్ సంపాదించి, ఆ తర్వాత దానిని DLF సంస్థకు భారీ లాభానికి విక్రయించారని ఈడీ పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారం ద్వారా PMLA చట్టం ప్రకారం 58 కోట్ల మేర అక్రమ సొమ్ము ఆర్జించారని ఈడీ చార్జ్షీట్లో స్పష్టం చేసింది.
ఈ కేసు చార్జ్షీట్ను పరిశీలించిన ప్రత్యేక కోర్టు రాబర్ట్ వాద్రాకు సమన్లు జారీ చేస్తూ మే 16న హాజరు కావాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఇవాళ హాజరైన వాద్రాకు 50వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తు, అంతే మొత్తానికి సమానమైన ఒక షూరిటీ సమర్పించాలనే షరతుపై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనిపై స్పందించిన రాబర్ట్ వాద్రా దేశ న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. అయితే దర్యాప్తు సంస్థ అయిన ఈడీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా నడుచుకుంటోందని ఆరోపించారు. తన వద్ద దాచడానికి ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు.






Total views : 78774