ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వేంకటగిరి పట్టణ కేంద్రంలో ఉన్న విశ్వోదయ కాలేజీ భూమి వివాదం ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీసింది. దశాబ్దాల క్రితం ప్రజా అవసరాల కోసం కేటాయించబడిన ప్రభుత్వ భూములు కాలక్రమంలో కొన్ని చోట్ల దుర్వినియోగానికి గురవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంకటగిరిలో కళాశాలకు చెందిన సుమారు ఆరు ఎకరాల భూమిలో మూడు ఎకరాల భాగం ప్రస్తుతం వివాదంలో ఉంది. ఈ స్థలం గతంలో ప్రభుత్వ కార్యాలయాలు, హాస్టల్ అవసరాలకు వినియోగించినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఈ భూమి ఖాళీగా ఉండటంతో, దీని విలువ పెరిగి కోట్ల రూపాయలకు చేరడంతో వివాదం మరింత ముదిరింది. దీంతో స్థానికంగా భూమి హక్కులపై ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి.
ప్రస్తుతం ఈ భూమిపై కొందరు వ్యక్తులు తప్పుడు పత్రాలు సృష్టించి తమదేనని పేర్కొంటూ కబ్జాకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై స్థానికులు అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదులు చేసినప్పటికీ సరైన స్పందన రావడం లేదని చెబుతున్నారు. రాజకీయ ప్రభావం కారణంగా చర్యలు ఆలస్యమవుతున్నాయని కూడా విమర్శలు ఉన్నాయి. ఇదే క్రమంలో జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని ప్రభుత్వ ఆస్తిని రక్షించాలని ప్రజా సంఘాలు , స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ భూములు ప్రజా ప్రయోజనాల కోసం ఉద్దేశించబడినవని, వాటిని కాపాడటం అధికారుల బాధ్యత అని స్థానికులు అంటున్నారు. ఈ వివాదంపై అధికార యంత్రాంగం ఎలా స్పందిస్తుందో అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.




Total views : 90427