నల్గొండ జిల్లాలో అధికారుల నిర్లక్ష్యానికి ఇది పరాకాష్టగా చెప్పవచ్చు. కొండమల్లేపల్లి నుంచి నాంపల్లి వెళ్లే ప్రధాన రహదారి గత ఏడాదిన్నరగా పూర్తిగా శిథిలావస్థకు చేరింది. గుంతలతో నిండిన ఈ రోడ్డు వాహనదారులకు నిత్యం ప్రమాదకరంగా మారింది. దుమ్ము, ధూళితో కప్పుకుపోయిన ఈ మార్గంలో ప్రయాణం చేయడం అంటే ప్రాణాలతో చెలగాటమేనని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనేక మంది చిన్నచిన్న ప్రమాదాల్లో గాయపడి ఆసుపత్రుల పాలయ్యారని చెబుతున్నారు. అంబులెన్స్లు కూడా వేగంగా వెళ్లలేని పరిస్థితి నెలకొనడంతో అత్యవసర వైద్యం అందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోడ్డు పక్కన నివసించే ప్రజలు దుమ్ము కారణంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. చిన్నారులు, వృద్ధులు దగ్గు, ఆయాసంతో ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. అధికారులు ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా స్పందన లేకపోవడం స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి పెరుగుతుంది
ఇదే రహదారి పక్కన ఉన్న రైతులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. పొలాలపై ఎగసిపడుతున్న దుమ్ము కారణంగా పంటలపై బూడిద పేరుకుపోయి దిగుబడి పూర్తిగా తగ్గిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినా ఒక్క గింజ కూడా చేతికి రాకుండా పంటలు నాశనం అవుతున్నాయని వారు చెబుతున్నారు. వాహనాల రాకపోకలతో దుమ్ము మరింత పెరిగి వ్యవసాయ భూములు బీడుబారినట్లు మారుతున్నాయని రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రోడ్డుపై రాస్తారోకో చేసి పెద్ద ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు. వెంటనే కొత్త బీటీ రోడ్డు నిర్మించి ప్రజలకు, రైతులకు ఉపశమనం కలిగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే గ్రామంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.






Total views : 90594