హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో పోలీసు స్టేషన్ లో తప్పుడు ఫిర్యాదిచ్చి భయపెట్టాడు. ఫిర్యాదు వెనక్కి తీసుకుంటానంటూ.. అర్థరాత్రి వేళ దంపతులతో కాళ్లు మొక్కించుకున్నాడు.. ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బిహార్ కు చెందిన లీలావతి, ఆమె భర్త ఉప్పల్ లక్ష్మీనారాయణ కాలనీలో ఉంటూ.. సమీపంలో ఉన్న ఓ అట్టల కంపెనీలో పనిచేస్తున్నారు. లీలావతి ఇద్దరు పిల్లలు, మరికొంత మందితో కలిసి కాలనీలోని రోడ్డు పై క్రికెట్ ఆడారు. అదే కాలనీలో ఉండే మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ నాయకుడు రాత్రి వేళ ఆటలేంటంటూ దూషిస్తూ లీలావతి, ఆమె భర్తపై దాడి చేశాడు. అంతేకాదు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాత్రివేళల్లో పెట్రోలింగ్ నిర్వహించే పోలీసులు వచ్చి వారిని పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లారు. బాధితులుఇచ్చిన ఫిర్యాదు తీసుకోకుండా లీలావతి కుటుంబం తన బంగారు గొలుసు దొంగిలించారంటూ వారిపైనే ఫిర్యాదుచేశాడు. భయపడిపోయిన ఆ దంపతులు కేసు పెట్టవద్దని సదరు నేతను బతిమిలాడుకున్నారు. పోలీసుల సాక్షిగా నాయకుడు కాళ్లు మొక్కడంతో ఫిర్యాదు ను వెనక్కి తీసుకున్నాడు. ఈ సంఘటన కు సంబంధించిన వీడియోలు వైరల్ అవ్వటంతో ఈ ఘటన వెలుగుచూసింది.






Total views : 90434