కోట్ల రూపాయల విలువైన భూములను కాజేసేందుకు భారీ కుట్ర జరిగిందంటూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సోదరుడు రామకృష్ణ తమకు భారీ మొత్తంలో డబ్బులు, అపార్ట్మెంట్లలో ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చి భూముల అగ్రిమెంట్లు చేయించుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అయితే హామీలు నెరవేర్చకుండా తొమ్మిదేళ్లుగా తమను మోసం చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు.
గుంటూరు జిల్లా తాడేపల్లి మండల పరిధిలోని సర్వే నంబర్లు 313, 314, 319, 320 ప్రాంతాల్లో సుమారు 92 ఎకరాల సారవంతమైన వ్యవసాయ భూమి ఉంది. దాదాపు 90 మంది రైతులకు చెందిన ఈ భూముల్లో ఏటా మూడు పంటలు పండుతుంటాయి.అయితే తొమ్మిదేళ్ల క్రితం విష్ణుప్రియ ప్రైవేట్ వెంచర్స్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న రామకృష్ణ రైతులను సంప్రదించి.. ఈ ప్రాంతంలో భారీ అపార్ట్మెంట్ల నిర్మాణం చేపడతామని చెప్పినట్లు రైతులు ఆరోపిస్తున్నారు.
డెవలప్మెంట్ కోసం భూములు అవసరమని, భూములకు ప్రతిఫలంగా అపార్ట్మెంట్లలో ప్లాట్లతో పాటు భారీ మొత్తంలో నగదు చెల్లిస్తామని హామీ ఇచ్చి అగ్రిమెంట్లు చేసుకున్నారని రైతులు చెబుతున్నారు.హామీలను నమ్మిన రైతులు అగ్రిమెంట్లపై సంతకాలు చేసినప్పటికీ, కొంతమందికి మాత్రమే డబ్బులు చెల్లించి, మిగిలిన వారికి ఎలాంటి చెల్లింపులు చేయలేదని ఆరోపిస్తున్నారు.
తమకు రావాల్సిన మొత్తాల గురించి ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని, భూములను తక్కువ ధరకే విక్రయించాలని ఒత్తిడి తెస్తున్నారని బాధితులు వాపోతున్నారు.ఈ వ్యవహారం జరిగి దాదాపు తొమ్మిదేళ్లు గడిచినా ఇప్పటి వరకు తమకు న్యాయం జరగలేదని, ప్రభుత్వం జోక్యం చేసుకుని పూర్తి విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు.





Total views : 90570