ఒడిశాలోని పూరీ క్షేత్రంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఏడాది పొడవునా గర్భగుడిలో దర్శనమిచ్చే ఆ పరమాత్ముడు… తన అన్న బలభద్రుడు, చెల్లెలు సుభద్ర దేవితో కలిసి భక్తకోటిని తరింపజేయడానికి రథారూఢుడయ్యాడు. ఆ …అద్భుత ఆధ్యాత్మిక వైభవాన్ని కళ్లారా చూసినా..స్మరించుకున్నా పుణ్య ప్రాప్తి లభిస్తోందన్న విశ్వాసంతో భక్తజనం తరిస్తోంది.
అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు పూరీ జగన్నాథుడు ఏడాదికి ఒకసారి గర్భగుడి నుంచి బయటకు వస్తాడు. గుండిచా ఆలయంలోని.. తన అత్తవారింటికి వెళ్లే సుదూర ప్రయాణాన్ని కనులారా వీక్షించేందుకు దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు పూరీ క్షేత్రానికి తరలివచ్చారు. బడుగు, బలహీన, కులమత భేదాలు లేకుండా… ఆ జగన్నాథుడి రథం తాడును ఒక్కసారైనా తాకాలని, ఆ రథాన్ని లాగి ధన్యులవ్వాలని భక్తులు పోటీ పడటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రథ చక్రాల సవ్వడి… శంఖనాదాలు… భక్తుల జయ జయ ధ్వనాల మధ్య పూరీ వీధులు ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకున్నాయి.
భారీగా భక్తులు తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. 100 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఒకరిని కటక్కు చెందిన అనిల్ దాస్గా గుర్తించారు. మరోకరి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు, అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.





Total views : 212498