రైలు లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడి లో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటన పాకిస్తాన్లోని అశాంత పీడిత బలూచిస్తాన్ ప్రావిన్స్ చోటు చేసుకుంది. క్వెట్టా-చమన్ ఫాటక్ రైల్వే ట్రాక్ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న రైలును లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు భారీ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ భీకర పేలుడు ధాటికి మహిళలు, చిన్నారులతో సహా మొత్తం 23 మంది అక్కడికక్కడే మరణించగా, 47 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు జరిగిన వెంటనే ఆ ప్రాంతమంతా రక్తసిక్తంగా మారగా, సమాచారం అందుకున్న పాకిస్తాన్ భద్రతా బలగాలు, రెస్క్యూ టీమ్స్ క్షతగాత్రులను క్వెట్టాలోని సివిల్ ఆసుపత్రికి తరలించాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో అత్యవసర పరిస్థితి విధించి వైద్యులు చికిత్స అందిస్తుండగా, గాయపడిన వారిలో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఈ ఘోర ఉగ్రదాడి వెనుక బలూచిస్తాన్ వేర్పాటువాద ఉగ్రవాద సంస్థ అయిన ‘బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ’ హస్తం ఉన్నట్లు భద్రతా సంస్థలు తెలిపాయి. బలూచిస్తాన్ ప్రాంతంలో గత కొన్ని నెలలుగా రైల్వే మౌలిక సదుపాయాలు, భద్రతా బలగాలు మరియు సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు వరుస దాడులకు తెగబడుతున్నారు. ఈ ఘటనను పాకిస్తాన్ ప్రభుత్వ ఉన్నతాధికారులు తీవ్రంగా ఖండించారు. నిరపరాధులైన మహిళలు, చిన్నారులపై దాడులకు పాల్పడే ఉగ్రవాదులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.






Total views : 89042