అమెరికాతో ఇరాన్ ఒప్పందం ఇప్పట్లో కుదురుతుందా… ఇదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి నోళ్లలో నానుతున్న ప్రశ్న. త్వరలోనే డీల్ ఓకే అవుతుందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటిస్తున్నప్పటికీ… అందరిలోనూ ఏదో తెలియని సందేహాలు. నోటితో నవ్వి.. నొసటితో వెక్కిరించినట్లు ఉన్న ట్రంప్ వ్యవహారమే దీనికి ప్రధాన కారణం అని చెప్పవచ్చు. అయితే గతంతో పోల్చితే… ఇరాన్- అమెరికా చర్చల ప్రక్రియలో కొంత పురోగతి ఉన్నట్లు మాత్రం తెలుస్తోంది. చాలా కాలంగా అమెరికా డిమాండ్ చేస్తున్నట్లుగా… తమ దగ్గరున్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను వదులుకోడానికి ఇరాన్ అంగీకరించింది. ఈ నేపథ్యంలో వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య ఒప్పందం కుదరడానికి మార్గం మరింత సుగమం అయిందని అమెరికా అధికారులు చెబుతున్నారు. యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించి.. హర్మూజ్ను తిరిగి తెరవడమే లక్ష్యంగా ఇరు దేశాలు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అధికారికంగా ఒప్పందం కుదరగానే యురేనియం నిర్వీర్యం చేసే విధానాలపై చర్చలు జరపనున్నట్లు తెలిపారు.
వాస్తవానికి ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తలెత్తడానికి, అందులో అమెరికా జోక్యం చేసుకుని సమస్యను మరింత జఠిలం చేయడానికి ఈ యురేనియం నిల్వలే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ లెక్కల ప్రకారం.. ఆ దేశం దగ్గర 60శాతం శుద్ధి చేసిన 440 కిలోల యురేనియం నిల్వ ఉంది. దీన్ని ఇరాన్ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మరింత శుద్ధి చేసి అణ్వస్త్ర తయారీకి వినియోగించుకోవచ్చు. ఇదే భయంతో అమెరికా అణు నిరాయుధీకరణ డిమాండ్ చేసింది. దీనికి ఇరాన్ ససేమిరా అనడంతో.. సంక్షోభం తలెత్తింది. అది రానురానూ ముదిరి యుద్ధానికి దారి తీసింది. అయితే అంతర్జాతీయ ఒత్తిళ్ల మేరకు రెండు దేశాలు చర్చల ప్రక్రియను కొనసాగిస్తుండడంతో… తాత్కాలికంగా ఉద్రిక్తతలు చల్లారాయి. ఇప్పుడు చర్చల్లో మరింత పురోగతి రావడం.. యురేనియం విషయంలో ఇరాన్ కాస్త వెనక్కి తగ్గడంతో త్వరలోనే యుద్ధం ముగుస్తుందన్న ఆశలు బలపడుతున్నాయి.






Total views : 89071