లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ దాడులను తీవ్రతరం చేసింది. ఈ దాడుల్లో హెజ్బొల్లా చీఫ్ నయీమ్ ఖాసిం మేనల్లుడు, వ్యక్తిగత కార్యదర్శి అయిన అలీ యూసఫ్ హర్షీ హతమయ్యాడు. బీరుట్లో అతన్ని హతమార్చినట్లు IDF ప్రకటించింది. అమెరికా, ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన మరుసటి రోజే ఈ దాడి జరగడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ మేరకు ఎక్స్లో IDF ఒక ప్రకటన విడుదల చేసింది. అలీ యూసఫ్.. హెజ్బొల్లా చీఫ్ ఖాసిం కార్యాలయ నిర్వహణలో, భద్రత కల్పించడంలో హర్షీ కీలక పాత్ర పోషించాడని తెలిపింది. ఈ దాడితో పాటు, లిటాని నదికి దక్షిణంగా ఆయుధాలను తరలించడానికి హెజ్బొల్లా ఉపయోగించే రెండు కీలక క్రాసింగ్లతో పాటు, దక్షిణ లెబనాన్లో 10 ఆయుధ నిల్వ కేంద్రాలు, లాంచర్లు, కమాండ్ సెంటర్లను కూడా ధ్వంసం చేసినట్లు IDF పేర్కొంది.
ఉత్తర ఇజ్రాయెల్ భద్రత విషయంలో రాజీపడబోమని, హెజ్బొల్లాపై దాడులను మరింత కఠినంగా కొనసాగిస్తామని ఐడీఎఫ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఈయల్ జమీర్ స్పష్టం చేశారు. ప్రతి కార్యాచరణ అవకాశాన్ని ఉపయోగించుకుంటామని ఆయన హెచ్చరించారు. మరోవైపు ఎవరైతే ఇజ్రాయెల్ పౌరులపై దాడులకు పాల్పడతారో వారిని నాశనం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. తమ సందేశం చాలా స్పష్టంగా ఉందంటూ లెబనాన్పై ఇజ్రాయెల్ దళాలు చేసిన దాడులను ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.




Total views : 81441