తెలుగుదేశం పార్టీలో మూడో తరం నాయకత్వానికి పునాది పడింది . టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు, మంత్రి నారా లోకేష్ చేతిలోకి టీడీపీ పగ్గాలు అందాయి . పార్టీని ఇక మీదట ఆయన తన కనుసన్ననలో నడపబోతున్నారు. తెలుగుదేశం పార్టీకి ఆయన సర్వ సత్తాక అధినాయకుడు కాబోతున్నారు. చంద్రబాబు అధినేతగా ఉన్నా వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ పూర్తి బాధ్యతలను నిర్వహిస్తారు అని ఆపార్టీ నేతలు అంటున్నారు.తాజాగా టీడీపీ జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ చేత అధినేత హోదాలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగింది . లోకేష్ తో పాటు మొత్తం 252 మందితో కూడిన జాతీయ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని టీడీపీ అధిష్టానం తాజాగా నియమించింది. ఇందులో కీలక నేతల ప్రమాణం అంతా చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగింది . ఇక ఈ కమిటీలలో నేతల ఎంపిక అన్నది సామాజికవర్గాల వారీగా ప్రాంతాల ఆధారంగా జరిగిందని చెబుతున్నారు. అంతే కాదు పార్టీలో సీనియర్లకు చోటు దక్కింది. అలాగే ఉత్సాహవంతులు అయిన జూనియర్లకు , కొత్త వారికి కూడా సముచిత స్థానం లభించింది.
నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కీలక బాధ్యతలు చేపట్టడంలో చాలా విశేషాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అన్నది గతంలో ఎప్పుడు లేదు. టీడీపీ నాలుగున్నర దశాబ్దాల చరిత్రలో తొలిసారిగా సృష్టించిన ఈ పదవిలోకి లోకేష్ మొదటిసారి వచ్చారు . మరో వైపు లోకేష్ వయసు కంటే టీడీపీ వయస్సు పెద్దది. అలాంటి పార్టీ బాధ్యతలను ఆయన మోయనుండడం మరో విశేషం. చంద్రబాబు చేతికి టీడీపీ పగ్గాలు అందేనాటికి ఆయన వయసు 45 ఏళ్ళు. దాదాపుగా టీడీపీ పగ్గాలు అన్నీ లోకేష్ వే అన్నట్లుగా అందుతున్న ఈ పదవిని బాబు కంటే చిన్న వయసులోనే లోకేష్ దక్కించుకోవడం మరో విశేషం . టీడీపీని ఎన్టీఆర్ స్థాపించి 14 ఏళ్ళ పాటు నడిపారు. ఆయన తరువాత చంద్రబాబు మూడు దశాబ్దాల పాటు టీడీపీని మొత్తం తన భుజాన వేసుకున్నారు ఇపుడు లోకేష్ పసుపు పార్టీ భారం తాను తీసుకుంటున్నారు.
ఇక కేవలం నెల కంటే తక్కువ సమయం టీడీపీ మహానాడుకు ఉంది. లోకేష్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టాక తొలి పార్టీ పండుగ అదే అవుతుంది . అంతే కాదు అతి పెద్ద టీడీపీ వేడుక కూడా అదే . దానిని లోకేష్ పూర్తిగా తన నాయకత్వ పటిమతో నిర్వహించనున్నారు. ఆ తరువాత స్థానిక సంస్థల ఎన్నికలు ఇదే ఏడాది జరగనున్నాయి. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వ్యూహాలు ఇలా మొత్తం పార్టీ వ్యవహారాలలో లోకేష్ ది అతి ముఖ్య పాత్ర ఉంటుందని పార్టీ నేతలు అని అంటున్నారు. ఇదే క్రమంలో 2029 ఎన్నికలు కూడా లోకేష్ కి పెద్ద బాధ్యత కానున్నాయని చెప్పొచ్చు . బాబు సలహా సూచనలతో పార్టీని లోకేష్ నడిపినా భారంలో సింహ భాగం ఆయనదే అని అంటున్నారు. మొత్తానికి పార్టీ పరంగా లోకేష్ కు పట్టాభిషేకం జరిగిందని చెప్పొచ్చు . ఇక మిగిలింది ప్రభుత్వ పరంగా పట్టాభిషేకమే అని విశ్లేషకులు అంటున్నారు.




Total views : 62311