ఉత్తర భారతదేశంలో మరోసారి భూకంపం సంభవించింది. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంతో పాటు పంజాబ్, హర్యానా, రాజస్థాన్, జమ్మూ కశ్మీర్లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రాత్రి సమయంలో ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో ఇళ్లలో ఉన్నవారు, అపార్ట్మెంట్లలో నివసించే వారు ప్రాణభయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ నివేదిక ప్రకారం, ఈ భూకంపం యొక్క కేంద్ర బిందువు ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.5 నమోదైనట్లు అధికారులు తెలిపారు. భూకంపం సంభవించిన సమయంలో ఇళ్లలోని ఫ్యాన్లు, వస్తువులు ఊగడం చూసి స్థానికులు ఆందోళన చెందారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అధికారులు వెంటనే స్పందించి ఎలాంటి అపాయం జరగకుండా అప్రమత్తం చేశారు. ఎత్తైన భవనాల్లో నివసించే వారు తక్షణమే బయటకు రావాలని సూచించారు.
Tag: