పశ్చిమాసియాలో మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చమురు, గ్యాస్ రిఫైనరీలే లక్ష్యంగా దాడులు, హర్మూజ్ జలసంధిలో నౌకలు నిలిచిపోవడంతో ఆ ప్రభావం మనదేశంపైనా పడింది. ఐతే క్రమక్రమంగా ఎల్పీజీ కష్టాలకు బ్రేక్ పడుతోంది. తాజాగా మరో ఎల్పీజీ భారీ నౌక భారత్కు చేరింది.. అమెరికాలోని టెక్సాస్ నుంచి ఎల్పీజీని తీసుకువస్తున్న ఒక కార్గో నౌక కర్ణాటకలోని న్యూ మంగళూరు పోర్టుకు విజయవంతంగా చేరుకుంది. పిక్సిస్ పయనీర్ నౌక 16 వేల 714 టన్నుల ఎల్పీజీని మోసుకొని మంగళూరు పోర్టుకు చేరుకుంది. వచ్చే వారంలో ఇంకా 72 వేల 700 టన్నుల ఎల్పీజీ రానుంది. ఈనెల 25న 26వేల 687 టన్నుల ఎల్పీజీతో అపోలో ఓషన్..ఈనెల 29న 30 వేల టన్నుల ఎల్పీజీతో మరో నౌక భారత్కు చేరనుంది. అంతే కాదు..గల్ఫ్ ప్రాంతంలోని భారతీయ నౌకలు, నావికులందరూ సురక్షితంగా ఉన్నారని ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యూహాత్మకంగా ముఖ్యమైన హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ వాణిజ్య మార్గాలకు అంతరాయం ఏర్పడిన టైమ్లో నౌక భారత్కు చేరడం గర్వకారణంగా చెబుతున్నారు. ఈ సంక్షోభ సమయంలో ఇంధన సరఫరాలను నిర్ధారించడానికి, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ మార్చి 14 నుంచి 31 వరకు ముడి చమురు, ఎల్పీజీపై కార్గో ఛార్జీల మాఫీని సైతం ప్రకటించడం బిగ్ రిలీఫ్గా మారింది.
#LPG
పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఎల్పీజీ సరఫరా దెబ్బతింటోంది. ఇంధన దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే దేశాలకు ఇది పెద్ద సవాల్గా మారింది. భారత్ కూడా ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఎల్పీజీ కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో భారత్ DME డైమిథైల్ ఈథర్ అనే కొత్త ప్రత్యామ్నాయ ఇంధనంపై దృష్టి సారించింది. ఇది ఎల్పీజీకి సమానంగా ఉపయోగించగల వాయువు. రసాయన పరంగా కూడా ఇది ఎల్పీజీకి దగ్గరగా ఉండటంతో వంట గ్యాస్గా సులభంగా ఉపయోగించవచ్చు. భవిష్యత్తులో ఎల్పీజీపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు దీనిని ‘ప్లాన్-బి’గా ప్రభుత్వం పరిగణిస్తోంది. డీఎంఈను తయారు చేయడానికి అవసరమైన ముడి పదార్థాలు దేశంలోనే లభిస్తాయి. బయోమాస్, బొగ్గు, మిథనాల్, గాలిలోని కార్బన్ డయాక్సైడ్ వంటి వనరులతో దీనిని తయారు చేయవచ్చు. అంటే విదేశీ దిగుమతులపై ఆధారపడకుండా దేశీయ వనరులతోనే గ్యాస్ తయారు చేసే అవకాశం ఉంటుంది.
డీఎంఈను నేరుగా వంట గ్యాస్గా వాడవచ్చు. అలాగే ఎల్పీజీతో కలిపి కూడా ఉపయోగించవచ్చు. దీన్ని బ్లెండింగ్ అంటారు. మొదటి దశలో ఎల్పీజీలో కొంత శాతం డీఎంఈ కలిపి వినియోగించే ప్రణాళికను పరిశీలిస్తున్నారు. ఇది విజయవంతమైతే క్రమంగా పూర్తిగా ప్రత్యామ్నాయ ఇంధనంగా మారే అవకాశం ఉంది. డీఎంఈ వినియోగంలో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, కొత్తగా స్టవ్లు లేదా సిలిండర్లు కొనాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం ఇళ్లలో ఉపయోగిస్తున్న ఎల్పీజీ సిలిండర్లు, రెగ్యులేటర్లు, పైపులు, బర్నర్ స్టవ్లు ఇదే విధంగా పనిచేస్తాయి. అందువల్ల వినియోగదారులకు అదనపు ఖర్చు ఉండదు.
ఈ ప్రాజెక్టుపై CSIR – Council of Scientific and Industrial Research శాస్త్రవేత్తలు విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటికే ఒక పైలట్ ప్లాంట్ను ఏర్పాటు చేసి డీఎంఈ ఉత్పత్తి విధానాన్ని పరీక్షిస్తున్నారు. దీనిని తక్కువ ఖర్చుతో తయారు చేయడం ఎలా అనే దానిపై ప్రత్యేకంగా పరిశోధనలు సాగుతున్నాయి. డీఎంఈను స్వచ్ఛమైన ఇంధనంగా కూడా పరిగణిస్తున్నారు. దీనిని కాల్చినప్పుడు సాధారణంగా తక్కువ కాలుష్యం ఉత్పత్తి అవుతుంది. కార్బన్ ఉద్గారాలు తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. అందువల్ల పర్యావరణ పరిరక్షణకు కూడా ఇది ఉపయోగకరమని నిపుణులు చెబుతున్నారు.
ఎల్పీజీ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధ పరిణామాలు భారత్లో గ్యాస్ కష్టాలను తెచ్చిపెడతాయన్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎల్పీజీ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, పెట్రోలియం శాఖ అధికారులతో జరిగిన ఈ సమావేశంలో ప్రజలకు గ్యాస్ కొరత లేకుండా చూసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని, దేశంలో సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
కేంద్ర ప్రభుత్వం మార్చి 8న జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం.. దేశంలోని రిఫైనరీలు, పెట్రోకెమికల్ సంస్థలు తమ ఎల్పీజీ ఉత్పత్తిని గరిష్ట స్థాయికి పెంచాలని ఆదేశించింది. పారిశ్రామిక అవసరాల కంటే గృహ వినియోగదారులకు సరఫరా చేయడానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసింది. అయితే హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వాణిజ్య సంస్థలకు గ్యాస్ పంపిణీని కొంతవరకు క్రమబద్ధీకరించారు. కానీ ఆస్పత్రులు, విద్యాసంస్థల వంటి అత్యవసర సేవలకు మాత్రం ఎలాంటి కోత లేకుండా నిరంతరం వాణిజ్య ఎల్పీజీ సరఫరా కొనసాగేలా చర్యలు తీసుకున్నారు.
గ్యాస్ సరఫరా వ్యవస్థను దెబ్బతీసేలా ఎవరైనా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. గ్యాస్ ఏజెన్సీలు, నిల్వ కేంద్రాల వద్ద భద్రతను పెంచాలని, అక్రమ నిల్వలు చేసే వారిపై నిఘా ఉంచాలని సూచించింది. ప్రతిరోజూ గ్యాస్ సరఫరా స్థితిగతులను పర్యవేక్షించాలని డీజీపీలకు ఆదేశాలు అందాయి. అలాగే, కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడే వారిని అస్సలు వదలవద్దని హోంశాఖ కార్యదర్శి స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో ఎల్పీజీ కొరతపై జరుగుతున్న అసత్య ప్రచారాల పట్ల ప్రభుత్వం సీరియస్ అయింది. పాత వీడియోలు లేదా సంబంధం లేని ఫోటోలను పెట్టి ప్రజలను భయపెట్టే వారిపై ఐటీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ద్వారా ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలని, అవగాహన కల్పించాలని కోరింది. దీనికోసం కేంద్ర హోంశాఖ, సమాచార ప్రసార శాఖ, పెట్రోలియం శాఖల సమన్వయంతో 24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. గ్యాస్ సరఫరాపై ఏవైనా అనుమానాలు ఉంటే రాష్ట్రాలు వెంటనే ఈ కంట్రోల్ రూమ్ ద్వారా స్పష్టత పొందవచ్చని తెలిపింది.




Total views : 61818