పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఎల్పీజీ సరఫరా దెబ్బతింటోంది. ఇంధన దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే దేశాలకు ఇది పెద్ద సవాల్గా మారింది. భారత్ కూడా ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఎల్పీజీ కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో భారత్ DME డైమిథైల్ ఈథర్ అనే కొత్త ప్రత్యామ్నాయ ఇంధనంపై దృష్టి సారించింది. ఇది ఎల్పీజీకి సమానంగా ఉపయోగించగల వాయువు. రసాయన పరంగా కూడా ఇది ఎల్పీజీకి దగ్గరగా ఉండటంతో వంట గ్యాస్గా సులభంగా ఉపయోగించవచ్చు. భవిష్యత్తులో ఎల్పీజీపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు దీనిని ‘ప్లాన్-బి’గా ప్రభుత్వం పరిగణిస్తోంది. డీఎంఈను తయారు చేయడానికి అవసరమైన ముడి పదార్థాలు దేశంలోనే లభిస్తాయి. బయోమాస్, బొగ్గు, మిథనాల్, గాలిలోని కార్బన్ డయాక్సైడ్ వంటి వనరులతో దీనిని తయారు చేయవచ్చు. అంటే విదేశీ దిగుమతులపై ఆధారపడకుండా దేశీయ వనరులతోనే గ్యాస్ తయారు చేసే అవకాశం ఉంటుంది.
డీఎంఈను నేరుగా వంట గ్యాస్గా వాడవచ్చు. అలాగే ఎల్పీజీతో కలిపి కూడా ఉపయోగించవచ్చు. దీన్ని బ్లెండింగ్ అంటారు. మొదటి దశలో ఎల్పీజీలో కొంత శాతం డీఎంఈ కలిపి వినియోగించే ప్రణాళికను పరిశీలిస్తున్నారు. ఇది విజయవంతమైతే క్రమంగా పూర్తిగా ప్రత్యామ్నాయ ఇంధనంగా మారే అవకాశం ఉంది. డీఎంఈ వినియోగంలో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, కొత్తగా స్టవ్లు లేదా సిలిండర్లు కొనాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం ఇళ్లలో ఉపయోగిస్తున్న ఎల్పీజీ సిలిండర్లు, రెగ్యులేటర్లు, పైపులు, బర్నర్ స్టవ్లు ఇదే విధంగా పనిచేస్తాయి. అందువల్ల వినియోగదారులకు అదనపు ఖర్చు ఉండదు.
ఈ ప్రాజెక్టుపై CSIR – Council of Scientific and Industrial Research శాస్త్రవేత్తలు విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటికే ఒక పైలట్ ప్లాంట్ను ఏర్పాటు చేసి డీఎంఈ ఉత్పత్తి విధానాన్ని పరీక్షిస్తున్నారు. దీనిని తక్కువ ఖర్చుతో తయారు చేయడం ఎలా అనే దానిపై ప్రత్యేకంగా పరిశోధనలు సాగుతున్నాయి. డీఎంఈను స్వచ్ఛమైన ఇంధనంగా కూడా పరిగణిస్తున్నారు. దీనిని కాల్చినప్పుడు సాధారణంగా తక్కువ కాలుష్యం ఉత్పత్తి అవుతుంది. కార్బన్ ఉద్గారాలు తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. అందువల్ల పర్యావరణ పరిరక్షణకు కూడా ఇది ఉపయోగకరమని నిపుణులు చెబుతున్నారు.




Total views : 61951