ప్రపంచప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరీలో శ్రీ జగన్నాథుని వార్షిక రథయాత్ర మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. ప్రతి ఏటా అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఈ పవిత్ర రథోత్సవం ఈ నెల 16న అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది. ఆషాఢ మాస శుక్ల పక్ష విదియ తిథిన ఈ రథయాత్ర ఘనంగా ప్రారంభమవుతుంది. జూలై 16 నుంచి 24 వరకు మొత్తం తొమ్మిది రోజుల పాటు ఈ వేడుకలు కనులపండువగా సాగనున్నాయి. శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవిల లీలా విశేషాలతో కూడిన ఈ పవిత్ర యాత్రను వీక్షించేందుకు దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. పూరీలోని ప్రధాన ఆలయం నుంచి ప్రారంభమయ్యే ఈ రథ యాత్ర భక్తుల జయజయధ్వానాల మధ్య గుండిచా మందిరం వరకు సాగుతుంది. అక్కడ కొలువై ఉండే స్వామివారలు, ఉత్సవాల అనంతరం తిరిగి జూలై 24న బహుదా యాత్ర ద్వారా మళ్లీ ప్రధాన ఆలయానికి చేరుకుంటారు. దీంతో ఈ తొమ్మిది రోజుల సుదీర్ఘ రథోత్సవ వేడుకలు ముగుస్తాయి. రథోత్సవాన్ని తిలకించేందుకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ, ఒడిశా ప్రభుత్వం ఇప్పటికే భారీ భద్రతా, రవాణా ఏర్పాట్లు చేస్తోంది. భక్తజన సంద్రంతో పూరీ క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
Tag: