తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు మరోసారి సమ్మె బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం గడువు ముగుస్తుండటంతో మరో 48 గంటల్లో సమ్మెకు వెళ్లేందుకు అన్ని డిపోల ఆర్టీసీ జేఏసీ నేతలు సన్నద్ధమయ్యారు. అయితే, ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి చర్చలకు అధికారికంగా ఎటువంటి పిలుపు రాకపోవడం ఉత్కంఠను పెంచుతోంది. ఆర్టీసీ కార్మికులు కోరుతున్న డిమాండ్లలో మెజారిటీ అంశాలకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే, ప్రధానమైన ‘ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం’, ‘యూనియన్ల పునరుద్ధరణ’ అనే రెండు డిమాండ్ల విషయంలో మాత్రం ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. ఈ రెండూ మినహా మిగిలిన అన్నింటిపై సానుకూలత వ్యక్తం చేసినా, జేఏసీ నేతలు మాత్రం తమ పట్టు వీడటం లేదు. సమ్మె అనివార్యమైతే సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ప్రైవేట్ డ్రైవర్లను సిద్ధం చేయడం, అద్దె బస్సులను నడపడం వంటి అంశాలపై రవాణా శాఖ దృష్టి సారించింది. ఈ క్రమంలోనే, రేపు మంత్రి పొన్నం ప్రభాకర్తో ఆర్టీసీ జేఏసీ నేతలు మరోసారి భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశం సఫలమైతేనే సమ్మె విరమణ దిశగా అడుగులు పడతాయి, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించే ప్రమాదం ఉంది.
Tag:





Total views : 89711