హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సమావేశమయ్యారు కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లో కొనసాగుతున్న వివిధ కీలక ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. నగరాభివృద్ధి, మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, ప్రజారవాణాకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఖట్టర్తో భేటీకి సంబంధించిన వివరాలపై ఓ ప్రకటన విడుదల చేశారు కిషన్రెడ్డి.
హైదరాబాద్ మెట్రో రెండోదశ ప్రాజెక్టుకు సంబంధించిన అంశంపై సమావేశంలో చర్చ జరిగిందని తెలిపారు కిషన్ రెడ్డి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎల్ అండ్ టీ సంస్థ నుంచి టేకోవర్ చేసుకున్న నేపథ్యంలో మిగిలిన రెండోదశ పనులకు సంబంధించిన DPR, ఇతర సాంకేతిక వివరాలు అందిన తర్వాత..కేంద్ర ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. హైదరాబాద్ మెట్రో రెండోదశ ప్రాజెక్టు విస్తరణకు కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 ఖర్చుచేసే ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. భాగ్యనగరంలోని మూసీనది పారిశుద్ధ్యానికి సంబంధించిన అంశంపైనా చర్చ జరిగిందని చెప్పారు కిషన్రెడ్డి. మూసీ నదిలో కలుస్తున్న మురుగునీటి శుద్ధికి అమృత్ 2.0లో భాగంగా రూ.3,975 కోట్లతో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.




Total views : 81759