పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లా పరిధిలోకి వచ్చే ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గ రీ-పోలింగ్ ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ అసాధారణ రీతిలో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి దేబాంగ్షు పాండా తన సమీప ప్రత్యర్థిపై ఏకంగా 1,09,021 ఓట్ల రికార్డు మెజారిటీతో ఘనవిజయం సాధించారు. మొత్తం 22 రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసేసరికి బీజేపీ అభ్యర్థికి 1,49,666 ఓట్లు రాగా, రెండో స్థానంలో నిలిచిన సీపీఐ(ఎం) అభ్యర్థి శంభునాథ్ కుర్మీకి 40,645 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుర్ రజాక్ మొల్లా 10,084 ఓట్లతో మూడో స్థానంలో నిలవగా, అధికార తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి జహంగీర్ ఖాన్ కేవలం 7,783 ఓట్లతో నాలుగో స్థానానికి పడిపోయి డిపాజిట్ కోల్పోవడం గమనార్హం. 1998లో టీఎంసీ పార్టీ స్థాపించిన తర్వాత ఆ పార్టీ అభ్యర్థి ఒకరు నాల్గో స్థానానికి పడిపోవడం, అలాగే 2011 తర్వాత తొలిసారి డిపాజిట్ కోల్పోవడం ఇదే మొదటిసారి కావడంతో ఈ ఫలితం బెంగాల్ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
ఈ నియోజకవర్గానికి ఏప్రిల్ 29న జరిగిన సాధారణ పోలింగ్ సమయంలో ఈవీఎంల ట్యాంపరింగ్, వెబ్-కెమెరా ఫుటేజ్ మార్పులు, బూత్ క్యాప్చరింగ్ వంటి తీవ్రమైన అక్రమాలు జరిగినట్లు ప్రతిపక్షాల నుండి భారీగా ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన భారత ఎన్నికల సంఘం ఫాల్టా నియోజకవర్గంలోని మొత్తం 285 పోలింగ్ బూత్లలో ఎన్నికలను రద్దు చేసి, మే 21న పూర్తి స్థాయిలో రీ-పోలింగ్ నిర్వహించింది. కేంద్ర బలగాల గట్టి నిఘా నీడలో జరిగిన ఈ రీ-పోలింగ్లో దాదాపు 87 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. గతంలో ఈ ఫల్తా సెగ్మెంట్ నుంచి డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీకి భారీ ఆధిక్యత లభించేదని, అయితే తాజా ఫలితంతో ఆ “డైమండ్ హార్బర్ మోడల్” కు పూర్తిగా తెరపడిందని ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ విజయంతో 294 మంది సభ్యులున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ బలం 208 సీట్లకు చేరుకుంది.





Total views : 90065