రాజమహేంద్రవరంలో ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ పర్యటన వడివడిగా సాగింది. జీవ నది గోదావరి కాలుష్య నియంత్రణ, పుష్కరాల ఏర్పాట్లపై ఆయన అధికారులు నుంచి సమగ్ర వివరాలు తెలుసుకున్నారు. బోటుపై పయనించి గోదావరి కాలుష్యాన్ని పరిశీలించారు. నదీ తీర ప్రాంతాల్లో అపరిశుద్ధ్యం, రేవుల నిర్వహణపై అధికారులను నిలదీశారు. అనంతరం కోటిలింగాల ఘాట్కు బోటుపైనే చేరుకొన్నారు. నదీ తీర పరిస్థితిని స్వయంగా చరవాణిలో బంధించారు. పెద్ద ఘాట్ కోటిలింగాల రేవు వద్ద తుప్పలు పేరుకుపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. అక్కడ నుంచి నల్లాఛానల్ వరకూ నడిచి వెళ్లారు. మురుగునీరు నేరుగా గోదావరిలో కలవడం, ప్లాస్టిక్ వ్యర్థాలు పెరిగిపోవడం చూసి.. అదే నీటిని తాగునీటికి వినియోగిస్తున్నారా..? అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లాఛానల్ పంపింగ్ స్కీమ్ పనితీరును తెలుసుకొన్నారు.
గోదావరిలో పారిశ్రామిక వ్యర్థాలు విడిచిపెట్టడం వల్ల కాలుష్యం పెరుగుతోందని, నియంత్రణకు సహకరించాలని పారిశ్రామికవేత్తలకు ఆయన పిలుపునిచ్చారు. సంబంధిత యాజమాన్యాలు వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా నదిలోకి విడిచిపెట్టొద్దని స్పష్టం చేశారు. పుష్కరాల 12 రోజులు పేపరుమిల్లు మూసివేస్తామని నిర్వాహకులు పేర్కొనగా.. అంత కాలుష్యం లేకుంటే ఎందుకు మూసేస్తారని ప్రశ్నించారు. జీవనదిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.




Total views : 90650