సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ ఢిల్లీలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష 19వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన వైద్య చర్యలన్నీ తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. అలాగే ప్రభుత్వ వైద్యులతో రోజూ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు వ్యతిరేకంగా సోనమ్ వాంగ్చుక్ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు, ప్రతి పౌరుడి ప్రాణం విలువైనదేనని..ఆయన ప్రాణాలను రక్షించేందుకు అవసరమైన వైద్యం తప్పనిసరిగా అందించాలని స్పష్టం చేసింది.
59 ఏళ్ల సోనమ్ వాంగ్చుక్ ఇప్పటికే 8.5 కిలోల బరువు తగ్గారని పిటిషన్లో పేర్కొన్నారు. ఆయన మరో 48 గంటలు నిరాహార దీక్ష కొనసాగిస్తే ప్రాణాపాయం ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అవసరమైతే ద్రవరూపంలో పోషకాహారం, విటమిన్లు, ఖనిజాలు అందించాలని పిటిషన్లో కోరారు. విచారణ సందర్భంగా వాంగ్చుక్ ఆరోగ్యాన్ని ప్రభుత్వ వైద్యులు ఎందుకు పర్యవేక్షించడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. రోజూ వైద్య పరీక్షలు జరుగుతున్నాయని, అయితే కొన్ని సందర్భాల్లో ప్రైవేట్ వైద్యులు కూడా పరీక్షిస్తున్నారని కేంద్రం తరఫు న్యాయవాది తుషార్ మెహతా తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం ఇకపై ప్రభుత్వ వైద్యులతోనే రోజువారీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. అవసరమైతే వెంటనే చికిత్స అందించాలని స్పష్టం చేసింది.





Total views : 212191