చిత్తూరు నగరంలోని ఎల్ఆర్ఎస్ హోటల్ సమీపంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురాగలిగారు . పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు సమన్వయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు . ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనలో ప్రాణనష్టం, ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారులు వెల్లడించాల్సి ఉంది. ఘటనపై విచారణ కొనసాగుతోంది.
Andhra Pradesh
రైతుల్లో నమ్మకం, ధైర్యం కల్పించేలా వెంటనే పొగాకు కొనుగోళ్లు పెద్దఎత్తున జరపాలని, ఇందుకోసం వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొగాకు కంపెనీలకు స్పష్టం చేశారు. ట్రేడర్లు కొనుగోళ్లు తగ్గించడం సరికాదని, కర్నాటకలో తలెత్తని సమస్య ఏపీలో ఎందుకు ఉత్పన్నం అవుతోందని సీఎం ప్రశ్నించారు. టొబాకో బోర్డు పనితీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులను ఇబ్బందిపెట్టేలా నడుచుకుని కంపెనీలు గుడ్ విల్ పోగొట్టుకోవద్దని, కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలకు మళ్లితే… తలెత్తే పరిస్థితి గురించి పొగాకు కంపెనీలు ఆలోచన చేయాలన్నారు. సచివాలయంలో బుధవారం పొగాకు కొనుగోళ్ల ప్రస్తుత స్థితిపై అధికారులు, ట్రేడర్లతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మొత్తం 28 కంపెనీలు సమర్పించిన ఇండెంట్ వివరాలు, ప్రస్తుతం జరిపిన కొనుగోళ్ల శాతాన్ని సమీక్షలో ముఖ్యమంత్రి పరిశీలించారు.
ఇండెంట్ ఇచ్చి కొనుగోలు చేయకుండా ప్రభుత్వానికి సహకరించకపోతే సహించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర కిలోకు 200 రూపాయలకు తగ్గకుండా, మొత్తం కొనుగోళ్లు జరిపితీరాలన్నారు. ముఖ్యంగా అతిపెద్ద మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు అయిన ఐటీసీ లిమిటెడ్, గాడ్ ఫ్రే ఫిలిప్స్ (ఐ) లిమిటెడ్, వీఎస్టీ ఇండస్ట్రీస్ 95.50 మిలియన్ కేజీల పంట కొనుగోళ్లకు ఇండెంట్ ఇవ్వగా… ఇప్పటివరకు కేవలం 17.6 మిలియన్ కేజీల పొగాకు మాత్రమే కొనుగోలు చేయడాన్ని తప్పుబట్టారు.
ఈ సీజన్లో ఐదవ సారి ఇదే అంశంపై సమీక్ష నిర్వహించాల్సి వచ్చిందంటే కంపెనీల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు.
రైతులు డిమాండ్కు మించి పొగాకు సాగు చేయడం ప్రస్తుత సమస్యకు కారణమని ట్రేడర్లు సీఎంకు వివరించారు. ఇప్పటికే అవసరానికి మించి కొనుగోళ్లు చేశామని… దానికి తోడు ఎగుమతులు కూడా తగ్గాయని తెలిపారు. అయినప్పటికీ కొనుగోళ్లు కొనసాగిస్తామని కంపెనీల ప్రతినిధులు వెల్లడించారు. పొగాకు బహిరంగ మార్కెట్ లేకపోవడం సమస్యను తీవ్రం చేశాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అలాగే కంపెనీలు 142 మిలియన్ కేజీలకు ఇండెంట్ ఇవ్వగా, రైతులు 232 మిలియన్ కేజీల పొగాకు ఉత్పత్తి చేశారన్నారు. దీంతో ధర పతనం కావడం, కొనుగోళ్లు లేకపోవడం జరిగిందని తెలిపారు.
అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి నారాయణ కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలు, రోడ్లు, ఎల్పీఎస్ లేఅవుట్లు తదితర ప్రాజెక్టుల పనులు ఎంతవరకు పూర్తయ్యాయో సంస్థల ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ప్రాజెక్టు పురోగతిని సమీక్షిస్తూ నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ సందర్భంగా రాజకీయ విమర్శలపై స్పందించిన మంత్రి నారాయణ… జగన్ చేస్తున్న “మావిగన్” రాజకీయ ఎత్తుగడలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. “మావిగన్ అంటే ఏ బస్సెక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారు” అంటూ వ్యాఖ్యానించారు. ప్రజలకు పరిపాలన సులభతరం చేసేందుకు అన్ని ప్రభుత్వ వ్యవస్థలను ఒకేచోటకు తీసుకొస్తే, అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్నారని అన్నారు.ఎవరెన్ని కుట్రలు పన్నినా అనుకున్న సమయానికే అమరావతి తొలి దశ పనులు పూర్తవుతాయని మంత్రి స్పష్టం చేశారు.
అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో రాజకీయ వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు నమోదైంది. జనసేన పార్టీ నాయకులు కొత్తకోట పోలీస్ స్టేషన్లో జడ శ్రవణ్ కుమార్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. జనసేన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఆధారాలను పోలీసులకు అందించారు. ఈ వ్యాఖ్యలపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పార్టీ ఇంచార్జ్ పీవీఎస్ఎన్ రాజు కోరారు. రాజకీయాల్లో అనుచిత భాషకు అడ్డుకట్ట వేయాలని ఆయన అన్నారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అంగవైకల్య యువతి సుంకోజు శివాని సామాజిక సేవపై ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రశంసలు కురిపించారు.స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా ఆమె చేస్తున్న సేవలను అభినందించిన ఎమ్మెల్యే..ఆమెకు తక్షణమే ఉద్యోగ అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్ను కోరారు.ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైందేనని చాటుతోంది మిర్యాలగూడ పట్టణంలోని 29వ వార్డుకు చెందిన అంగవైకల్య యువతి సుంకోజు శివాని. ఒక్క ఓటు కూడా మిస్ కాకూడదనే లక్ష్యంతో ఆమె స్వయంగా ఇంటింటికి వెళ్లి SIR దరఖాస్తు ఫారాలను నింపుతూ అవగాహన కల్పిస్తోంది.ఈరోజు పట్టణంలో SIR కార్యక్రమాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి..శివాని సేవలను చూసి స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా అభినందించారు.ఇప్పటికే 200 ఫారాలు నింపిన శివాని సామాజిక బాధ్యత అందరికీ ఆదర్శమన్నారు.ఆమె పీజీ చదివిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే..వెంటనే జిల్లా కలెక్టర్తో వీడియో కాల్ లో మాట్లాడి.. శివానికి తగిన ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు.నియోజకవర్గంలోని BLO,BLAలు, ప్రజాప్రతినిధులు అందరూ శివానిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించేలా కృషి చేయాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి ఊతమిచ్చేలా సచివాలయంలో కీలక అడుగు పడింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 19వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రాన్ని పెట్టుబడుల హబ్గా మార్చడమే ధ్యేయంగా సాగిన ఈ సమావేశంలో భారీ ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేసే దిశగా అడుగులు పడ్డాయి. ఈ ఉన్నత స్థాయి సమావేశానికి రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, పి.నారాయణ, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, పయ్యావుల కేశవ్తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ఆయా శాఖల ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఏపీలో పారిశ్రామిక విప్లవానికి కూటమి ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో సచివాలయంలో 19వ ఎస్ఐపీబీ సమావేశం జరిగింది. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెంచేందుకు, ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు వీలుగా పలు కీలక రంగాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.ముఖ్యంగా పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖల పరిధిలోని పలు ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్షించారు. రాబోయే రోజుల్లో ఏపీని పెట్టుబడుల స్వర్గధామంగా మార్చడమే లక్ష్యంగా అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే ధ్యేయంగా.. మొత్తం 9 వేల 76 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులకు సంబంధించిన 11 మెగా ప్రాజెక్టులపై ఈ ఎస్ఐపీబీ సమావేశంలో సమగ్రంగా చర్చించి ఆమోద ముద్ర వేశారు.
దక్షిణకొరియాలో మంత్రి లోకేష్ పర్యటన కొనసాగుతోంది. ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా ఆయన..ఆ దేశ రాజధాని వివిధ సంస్థల ప్రతినిధులతో భేటీ అవుతున్నారు. ఎల్జీ కెమ్ గ్లోబల్ స్ట్రాటజీ సెంటర్ ప్రెసిడెంట్ అండ్ ఎల్జీ ఓవర్సీస్ హోల్డింగ్ కంపెనీస్ హెడ్ యున్-జు కోహ్ తో భేటీ అయ్యారు. కాకినాడ పోర్టు సమీపంలో పాలీస్టైరిన్ తయారీ సముదాయాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. మూలపేటలో ప్రపంచ స్థాయి నాఫ్తా క్రాకర్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని కోరారు. మూలపేటలో ఎస్ఏఎఫ్, బయో-ఇథనాల్ ఉత్పత్తిపై దృష్టి సారించి, జీవ ఇంధనాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.ప్లాస్టిక్ రీసైక్లింగ్, పైరోలిసిస్ ప్లాంట్లను ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం వహించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వం అందించిన తాజా ప్రతిపాదనలపై సంస్థ ఉన్నతస్థాయి బృందంతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారుఎల్జీ కెమ్ గ్లోబల్ స్ట్రాటజీ సెంటర్ ప్రెసిడెంట్ యున్-జు కోహ్.
యూట్యూబర్ ప్రశ్న రావణ్ రిమాండ్ రిపోర్టులో గన్నవరం పోలీసులు కీలక అంశాలు పేర్కొన్నారు. యువత, విద్యార్థులను రావణ్ రెచ్చగొడుతున్నాడని.. అతడిపై తెలుగు రాష్ట్రాల్లో అనేక కేసులు నమోదయ్యాయన్నారు. నిషేధిత మావోయిస్టు సంస్థ వైపు యువతను ఆకర్షించేలా రావణ్ ప్రకటనలు చేస్తున్నారని… మతపరమైన విభేదాలు రెచ్చగొట్టేలా అతడి తీరు కనిపిస్తోందని పేర్కొంది. రాష్ట్రంలో అశాంతి సృష్టించాలనే ఉద్దేశం ఉందని… ఇటీవల ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ సమావేశంలో రెచ్చగొట్టేలా రావణ్ మాట్లాడారని తెలిపారు. అవమానకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని… పదవుల్లో ఉన్నవారిని దూషించడమే కాకుండా…. వ్యవస్థలపై ప్రజల్లో ద్వేషం, వైషమ్యాలు సృష్టిస్తున్నారని రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు.
మావోయిస్టు భావజాలాన్ని అతని ఫోన్లో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. హిడ్మాను కీర్తిస్తూ ప్రసంగాలు… దేవుళ్లను అవమానించడం, కించపరచడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని చెప్పారు. రావణ్ పేరు పెట్టుకోవడం కూడా అందులో భాగమే అని స్పష్టం చేశారు. అతడికి సహకరిస్తున్నవారెవరో తేల్చాల్సి ఉందని… విచారణకు నిందితుడు సహకరించడం లేదని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.
మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేసేలా, సాయుధ తిరుగుబాటును ప్రోత్సహించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదుతో రావణ్పై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. గన్నవరానికి చెందిన జనసేన నాయకుడు గరికపాటి శివశంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శనివారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. దేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతకు భంగం కలిగిస్తూ దేశద్రోహానికి పాల్పడ్డారంటూ బీఎన్ఎస్లోని 152 సహా పలు సెక్షన్లు, చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద ఆయనపై అభియోగాలు మోపారు. ఆదివారం సాయంత్రం రావణ్ను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఈనెల 18 వరకు రిమాండ్ విధించారు.
ఇక అంతకుముందు దక్షిణ కొరియా రాజధాని సియోల్లో భారత రాయబారి గౌరంగలాల్ దాస్తో మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఏపీలో కొరియా పెట్టుబడులను ఆకర్షించే అంశంపై విస్తృతంగా చర్చించారు.ఇండియా సెమీకండక్టర్ మిషన్, ఏపీ ఎలక్ట్రానిక్స్ పాలసీ 4.0కు అనుగుణంగా శాంసంగ్, ఎల్జీ, ఎస్కె తదితర కొరియా ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ దిగ్గజాలను ఏపీకి తీసుకురావడంలో సహకరించాలని రాయబారిని మంత్రి కోరారు. శ్రీసిటీ, నాయుడుపేట, కొప్పర్తి, విశాఖపట్నంలో రెడీ-టు-యూజ్ పారిశ్రామిక క్లస్టర్లు సిద్ధంగా ఉన్నాయని వివరించారు.
ఐఐటీ తిరుపతి, ఐఐఐటీ శ్రీసిటీ, ఆంధ్ర విశ్వవిద్యాలయాలతో కలిసి కొరియా అనుసంధాన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ప్రతిపాదించారు. అలాగే, కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్ భారత్ పర్యటన సందర్భంగా ప్రతిపాదించిన “కొరియా ఎన్క్లేవ్”కు కార్యరూపం దాల్చేలా శ్రీసిటీలో కొరియా ఎంఎస్ఎంఈల కోసం ప్లగ్-అండ్-ప్లే టౌన్షిప్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉందని తెలిపారు.అనంతపురంలోని కియా–హ్యుందాయ్ మోబిస్ ఆటో-ఈవీ క్లస్టర్ విస్తరణ, ఏపీ తీరంలో హెచ్డీ హ్యుందాయ్ తరహా గ్రీన్ఫీల్డ్ షిప్యార్డ్ ఏర్పాటు, బ్యాటరీలు, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల స్థాపన అవకాశాలపై కూడా సమావేశంలో చర్చించారు.
దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి సారించారు. ప్రముఖ ఫుట్వేర్ తయారీ సంస్థ షూఆల్స్ ఛైర్మన్, సీఈవో లీ చియాంగ్-గెన్తో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. గతంలో కుదిరిన ఎంవోయూ ప్రకారం రాష్ట్రంలో ఏర్పాటు కానున్న ఫుట్వేర్ తయారీ యూనిట్ పనులను వేగవంతం చేయాలని ఆయన కోరారు.300 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ యూనిట్ ద్వారా దాదాపు మూడు వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని లోకేష్ తెలిపారు. దీనితో పాటు ఆంధ్రప్రదేశ్లో ఆర్ అండ్ డీ, ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని, షూఆల్స్ ఉత్పత్తులకు ఏపీని రిటైల్, డిస్ట్రిబ్యూషన్ హబ్గా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. మంత్రి లోకేష్ సూచనలపై షూఆల్స్ ఛైర్మన్ లీ చియాంగ్-గెన్ సానుకూలంగా స్పందించారు. తమ సంస్థ మాగ్నెటిక్ థెరపీ, షాక్ అబ్సార్ప్షన్ టెక్నాలజీతో మెడికల్ ఫుట్వేర్ తయారీలో ప్రత్యేక గుర్తింపు పొందిందని తెలిపారు. ప్రస్తుతం సియోల్ నేషనల్ యూనివర్సిటీతో కలిసి ఏఐ ఆధారిత స్మార్ట్ మెడికల్ ఫుట్వేర్ను అభివృద్ధి చేస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.





Total views : 200840