రాష్ట్రంలో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి వెంటనే మిల్లులకు తరలించి బాయిల్డ్ రైస్గా మారుస్తోందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. తడిసిన ధాన్యం పేరుతో ఒక్క రైతును కూడా నష్టపరిచవద్దని, తాలు, తరుగు పేరుతో కోతలు విధిస్తే మిల్లర్లతో పాటు కొనుగోలు సిబ్బందిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాలకు ఇప్పటివరకు చేరుకొని కాంటా కోసం నిరీక్షిస్తున్న 8.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఒక్క సంవత్సరంలో ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి రూ.45 వేల కోట్ల చెల్లింపులు చేసిందన్నారు. ధాన్యం కొనుగోళ్లపై పౌరసరఫరాల రాష్ట్ర కార్యాలయం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, జూపల్లి, ఆడ్లూరి లక్ష్మణ్ , సీఎస్రామకృష్ణరావుతో కలిసి ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియా కాన్పరెన్స్నిర్వహించారు. ఈసందర్భంగా వివరిస్తూ కొనుగోళ్ల ప్రక్రియలో ట్యాగింగ్ ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తే రైతులకు త్వరితగతిన చెల్లింపులు జరుగుతాయని తెలిపారు. అవసరమైతే ఆదివారం రోజున కూడా నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యానికి 8 వేల 749 కోట్ల చెల్లింపులు ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు.
ప్రస్తుతం 21 కోట్ల గన్నీ బ్యాగులు సిద్ధంగా ఉన్నాయని, బ్యాగుల కొరత ఉందంటూ జరుగుతున్న ప్రచారం అబద్దమన్నారు. ప్రతిపక్షాలు రాజకీయ రాద్ధాంతం సృష్టించి రైతాంగంలో గందరగోళం సృష్టించేందుకే ఇటువంటి కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో పనిచేసే హమాలీలలో ఎక్కువ మంది పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులేనని, స్థానికంగా ఎవరూ పెద్దగా ఈ పనుల్లో పనిచేయడం లేదని తెలిపారు. బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో పాల్గొనేందుకు వారు స్వగ్రామాలకు వెళ్లి తిరిగి రాకపోవడంతో కొంత జాప్యం ఏర్పడిందన్నారు. రబీ సీజన్లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చినట్లు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రికార్డు స్థాయిలో కొనుగోళ్లు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉండగా, ఇప్పటికే 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ అత్యంత సునిశితమైనదని, ఎక్కడా రైతులు ఇబ్బందులు పడకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.





Total views : 90578