దేశాల భవిష్యత్కు ప్రపంచ టెలీకమ్యూనికేషన్ వ్యవస్థ అత్యంత కీలకమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏప్రిల్ 14న ‘క్వాంటం కంప్యూటింగ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్’ ప్రారంభోత్సవం అనంతరం, ప్రపంచస్థాయి క్వాంటం వ్యవస్థ దిశగా మరో ముఖ్యమైన అడుగు పడిందన్నారు.దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో క్వాంటం వ్యాలీ ఆధ్వర్యంలో ఆవిష్కరణలు, పరిశోధనలు కొనసాగుతున్నాయని సీఎం వెల్లడించారు. భారత ప్రభుత్వ టెలీకమ్యూనికేషన్ విభాగానికి చెందిన సీ-డాట్ సంస్థ, అమరావతి క్వాంటం వ్యాలీ భాగస్వామ్యంతో దేశంలోనే తొలి ‘క్వాంటం-సెక్యూర్ కమ్యూనికేషన్స్ టెస్ట్ బెడ్’ ఏర్పాటు కానుందని చెప్పారు.
ఈ టెస్ట్ బెడ్ ద్వారా క్వాంటం కమ్యూనికేషన్ రంగంలో పరిశోధనలు, పరీక్షలకు మరింత ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. డిజిటల్ సదుపాయాల అభివృద్ధిపై తమ ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనమన్నారు. అమరావతిని డీప్-టెక్, క్వాంటం ఆవిష్కరణల హబ్గా తీర్చిదిద్దడంలో ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు.అలాగే ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏపీ విద్యార్థులు, యువ పరిశోధకులకు ప్రపంచస్థాయి సాంకేతిక రంగాల్లో భాగస్వామ్యం అయ్యే అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.





Total views : 80419