గిరిజనులకు వ్యవసాయం తర్వాత రెండో జీవనాధారమైన తునికాకు సేకరణ ప్రక్రియ మొదలైంది. అడవుల్లో లభించే ఈ ఆకులను సేకరించి గిరిజనులు ఆదాయం పొందుతారు. ముఖ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని అడవుల్లో తునికాకు విస్తృతంగా లభిస్తుంది. బీడీలు తయారు చేయడానికి ఈ ఆకునే వాడడంతో… దీనికి గిరాకీ విపరీతంగా ఉంటుంది. కేవలం వర్షాధార పంటలను మాత్రమే సాగుచేసే గిరిజనులు… వేసవి కాలంలో సంపాదన కోసం ఈ తునికాకు సేకరణ వైపు మొగ్గు చూపుతారు. ఇంటిల్లి పాదీ అడవుల్లో తిరుగుతూ.. అనువైన ఆకులను సేకరిస్తారు. అటవీశాఖ టెండర్ల ద్వారా కాంట్రాక్టర్ల పర్యవేక్షణలో తునికాకు సేకరణ పనులు జరుగుతాయి..
అయితే ఈ తునికాకు సేకరణ అంత సులువైన పని కాదంటున్నారు గిరిజనులు. ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఆకులు కోయాల్సి ఉంటుందని.. ఈ క్రమంలో అనేక సార్లు గాయపడడం.. క్రూర జంతువుల బారిన పడడం జరుగుతోందని చెబుతున్నారు. అలాగే ఎంత తీవ్రత ఎక్కువగా ఉండడంతో తరచూ వడదెబ్బ బారిన పడిన పడుతున్నామని గ్రామస్తులు చెబుతున్నారు…
ఇన్ని కష్టాలు ఎదుర్కొని ఆకు సేకరిస్తే తమకు దక్కుతున్న ధర చాలా తక్కువని గిరిజనులు చెబుతున్నారు. ప్రస్తుతం కట్టకు కేవలం 3 రూపాయల 40 పైసలు ఇస్తున్నారని.. ఈ లెక్కన కుటుంబమంతా కలిసి కష్టపడినా 20 వేల రూపాయలు కూడా దక్కడం లేదని వాపోతున్నారు. కట్టకు కనీసం 5 రూపాయలు ఇస్తే గానీ తమ శ్రమకు తగ్గ ప్రతిఫలం రాదని తునికాకు సేకరిస్తున్న గిరిజనులు చెబుతున్నారు…
ప్రభుత్వం సరైన శ్రద్ధ చూపకపోవడంతో ఇప్పటికే తునికాకు సేకరించే వారి సంఖ్య తగ్గిపోయిందని.. ఇప్పటికైనా ధరలు పెంచి సరైన సౌకర్యాలు కల్పించకపోతే.. ఈ పని చేసే వారే ఉండరని గిరిజనులు అంటున్నారు.




Total views : 80287