నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ ఘటనపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న నిందితురాలు మనీషా గురునాథ్ మాంధరేనికి ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు 14 రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మహారాష్ట్ర పూణేకు చెందిన మనీషా.. ఒక సీనియర్ బోటనీ అధ్యాపకురాలు. ఈమెను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక నిపుణురాలిగా నియమించడంతో, నీట్ పరీక్షకు సంబంధించిన బోటనీ, జువాలజీ ప్రశ్నపత్రాలపై పూర్తి యాక్సెస్ లభించింది. ఆ అవకాశాన్ని వాడుకుని ఆమె పేపర్ లీక్ చేసినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. ఎన్టీఏ లోపల ప్రశ్నపత్రాల తయారీ నుంచి పంపిణీ వరకు జరిగిన మొత్తం ప్రక్రియపై ప్రస్తుతం లోతైన దర్యాప్తు జరుగుతోందని సీబీఐ కోర్టుకు తెలిపింది. మనీషా మాంధరే లీకైన ప్రశ్నలను విద్యార్థులకు ముందుగానే చేరవేసి, అందుకు ప్రతిఫలంగా వారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఆధారాలు సేకరించారు. దీని వెనుక ఉన్న ఆర్థిక లావాదేవీలు, నెట్వర్క్ను పూర్తిగా ఛేదించాల్సి ఉందని సీబీఐ స్పష్టం చేసింది. ఏప్రిల్ నెలలోనే ఈమె తన పూణే నివాసంలో సీక్రెట్ కోచింగ్ క్లాసులు పెట్టి లీకైన ప్రశ్నలను నోట్ బుక్స్లో రాయించినట్లు దర్యాప్తులో తేలినట్లు సీబీఐ కోర్టుకు స్పష్టం చేసింది. సీబీఐ రిమాండ్ దరఖాస్తును నిందితురాలి తరపు న్యాయవాది తీవ్రంగా వ్యతిరేకించారు. నిందితురాలి ఇంట్లో జరిపిన తనిఖీల్లో ఎలాంటి లీకేజీ ఆధారాలు, అక్రమ నిధులు లభించలేదని కోర్టుకు వివరించారు. మనీషా ఇప్పటికే రెండుసార్లు సీబీఐ విచారణకు హాజరై పూర్తిగా సహకరించిందని, గత 3 రోజులుగా ఆమె పోలీసు కస్టడీలోనే ఉందని గుర్తుచేశారు. ఈమెను మథురలోని ఒక హోటల్లో అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న రౌస్ ఎవెన్యూ కోర్టు.. ఈ కుంభకోణంలో ఉన్న అంతర్జాతీయ, జాతీయ నెట్వర్క్ను, ఎన్టీఏ లీకేజీ మూలాలను గుర్తించేందుకు నిందితురాలిని 14 రోజుల పాటు ప్రశ్నించేందుకు సీబీఐకి అనుమతినిచ్చింది.
నీట్ పేపర్ లీక్ కేసులో బిగ్ అప్డేట్..
45
previous post





Total views : 80422