నెల్లూరు జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లు, ఫోర్జరీ సంతకాల మాఫియా కలకలం రేపుతోంది. గూడూరు, కోట ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని రెవెన్యూ అధికారుల పేర్లతో నకిలీ రబ్బర్ స్టాంపులు తయారు చేసి అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్న గ్యాంగ్ వ్యవహారం బయటపడింది. రెండు రోజుల క్రితం నకిలీ సంతకాలతో జరిగిన రిజిస్ట్రేషన్ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన సీవీఆర్ న్యూస్… తాజాగా మరో ఫేక్ పొజిషన్ సర్టిఫికెట్ వ్యవహారాన్ని బట్టబయలు చేసింది. ఈ ఘటన జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల పనితీరుపై తీవ్ర అనుమానాలు స్థానిక ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.
ఇంటి రిజిస్ట్రేషన్ కోసం సమర్పించిన పొజిషన్ సర్టిఫికెట్పై అనుమానం రావడంతో సీవీఆర్ న్యూస్ విచారణ చేపట్టింది. సంబంధిత వీఆర్వో వెంకటరమణను సంప్రదించగా… సర్టిఫికెట్పై ఉన్న సంతకం, రబ్బర్ స్టాంప్ రెండూ నకిలీవేనని స్పష్టం చేశారు. దీంతో గూడూరు, కోటతో పాటు జిల్లాలోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇదే తరహాలో ఎన్ని అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయన్న చర్చ మొదలైంది. నకిలీ సర్టిఫికెట్లు, ఫేక్ ప్రభుత్వ ముద్రలతో భారీ స్థాయిలో భూ అక్రమాలు జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ గ్యాంగ్ వెనుక మరే శాఖల సహకారం ఉందా..? అనే కోణంలో కూడా చర్చ జరుగుతోంది. పూర్తి స్థాయి దర్యాప్తు చేపడితే మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని స్థానికులు అంటున్నారు.




Total views : 80909