తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త..
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన గరిష్ట వయోపరిమితిని మరో పదేళ్ల పాటు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఇందుకు సంబంధించి జీవో విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రస్తుతమున్న గరిష్ట వయోపరిమితిని 34 నుంచి 44ఏళ్లకు పెంచారు. ఈ వయోపరిమితి సడలింపు..ఉత్తర్వులు వెలువడిన తేదీ నుంచి ఏడాది పాటు అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ వయోసడలింపు నిర్ణయం వెనుక నిరుద్యోగుల విజ్ఞప్తులు ఉన్నాయి. గతంలో కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన పరిస్థితులు, ఉద్యోగ నియామకాల ప్రక్రియలో జరిగిన ఆలస్యం, సకాలంలో నోటిఫికేషన్లు రాకపోవడం వంటి కారణాల వల్ల వేలాది మంది నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగ పరీక్షలు రాయకుండానే వయోపరిమితిని దాటిపోయారు. తమకు న్యాయం చేయాలని, వయోపరిమితిని పెంచి మరో ఛాన్స్ కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ, అభ్యర్థులు ప్రభుత్వానికి వినతులిచ్చారు. ఈ క్రమంలోనే దీనిపై స్పందించిన ప్రభుత్వం అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
అయితే ఈ వయోపరిమితి పెంపు అనేది అన్ని రకాల ఉద్యోగాలకు వర్తించదు. రాష్ట్రంలోని వివిధ నియామక సంస్థలు (TGPSC లాంటివి) విడుదల చేసే సాధారణ సివిల్ ఉద్యోగాల నోటిఫికేషన్లకు మాత్రమే ఈ 44 ఏళ్ల సడలింపు ఉంటుంది. శారీరక దారుఢ్యం, నిర్దిష్ట ప్రమాణాలు అవసరమయ్యే యూనిఫాం సర్వీసులైన పోలీస్, ఎక్సైజ్, ఫైర్, జైళ్లు, అటవీ శాఖల ఉద్యోగాలకు మాత్రం ఈ వయోసడలింపు వర్తించదు. ఈ విషయాన్ని ప్రభుత్వం జీవోలో స్పష్టంగా పేర్కొంది.





Total views : 80693