పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలతో చమురు ధరలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పొదుపు చర్యలు చేపడుతున్నారు నేతలు. ప్రధాని మోదీ నుంచి కేంద్రమంత్రులు, సీఎంలు, రాష్ట్రమంత్రులు, ఇతర నేతలు పొదుపు మంత్రం పాటిస్తున్నారు. ఇందులో భాగంగా సైకిల్పై యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్య ఐలయ్య . యాదగిరిగుట్ట నుంచి ఆలేరు వరకు సైకిల్పై ప్రయాణించారు. పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకీ పెరిగిపోతుండటంతో ప్రజలపై తీవ్ర భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వ హయాంలో సామాన్య ప్రజలు మళ్లీ సైకిళ్లపై ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.
వంగపల్లి మీదుగా ప్రయాణిస్తూ అక్కడి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి వడ్ల కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా, వేగవంతంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులు పండించిన ప్రతి గింజకు సరైన ధర అందేలా చూడాలని, కొనుగోలు కేంద్రాల్లో లారీలు, తూకం, హమాలీలు వంటి సౌకర్యాలు సమయానికి అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలిగితే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.




Total views : 80909