డాక్టర్..బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో గైనకాలజిస్టుల కొరత వేధిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో మూడేళ్లుగా గైనకాలజిస్ట్ లేకపోవడంతో గర్భిణులు, మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అరవై గ్రామాలకు ఆరోగ్యదాయనిగా ఉన్న రాజోలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు వైద్యుల కొరతతో పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోట్ల రూపాయిలు ఖర్చు చేసి అందంగా భవనాలు నిర్మించి 50 పడకలు ఏర్పాటు చేసినా… రోగులకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గైనకాలిజిస్ట్ వైద్యులు అందుబాటులో లేకపోవడం వల్ల గర్భిణులు స్కానింగ్ వంటి కనీస సేవలు కూడా అందక ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రసవ వేదనతో వచ్చే మహిళలను, ప్రమాదానికి గురైన క్షతగాత్రులకు వైద్య సేవలు అందక అమలాపురం, కాకినాడ లో కార్పోరేట్ ఆసుపత్రులకు తీసుకు వెళ్లాల్సి వస్తోంది. గతంలో నెలకు 100కు పైగా ప్రసవాలు జరిగే ఈ ఆస్పత్రిలో ప్రస్తుతం గైనకాలజిస్ట్ లేకపోవడంతో వేరు వేరు ఆసుపత్రుల నుంచి వైద్యులను తీసుకొచ్చి డెలివరీలు నామమాత్రంగా చేయిస్తున్నారు. నిరంతర పర్యవేక్షణ లోపంతో ఎమర్జెన్సీ వస్తే హుటాహుటిన కాకినాడ లేదా మరెక్కడికైనా తరలించాల్సిన పరిస్థితులు ఉన్నాయి
గత రెండేళ్లుగా డాక్టర్ల నియామకం కోసం స్థానిక ఎమ్మెల్యే అడుగుతున్నా.. గైనకాలజిస్ట్ ని నియమించడం లేదు. ఒకానొక దశలో ఎమ్మెల్యే తీవ్ర అసహనానికి లోనై ఆసుపత్రి ఎదుటే ధర్నాకి దిగుతానని ఎమోషనల్ అయ్యారు. అయినప్పటికీ అధికారులలో ఏవిధమైన స్పందన లేదు. ఆర్థోపెడిక్ వైద్యులు ఉన్నా చికిత్సకు అవసరమైన సదుపాయాలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడం తో అత్యవసర ప్రమాద కేసులు వేరే ప్రాంతాలకు పంపాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ ఆసుపత్రికి పూర్తి స్థాయిలో ఇద్దరు గైనకాలజిస్ట్ లను నియమించాలని, ఆర్థోపెడిక్ విభాగానికి పూర్తి స్థాయిలో సదుపాయాలను కల్పించాలని కూటమి నేతలు వేడుకుంటున్నారు. ఈ ఆసుపత్రికి గైనకాలజిస్ట్ లతో పాటు అందరినీ పూర్తి స్థాయి వైద్యులను నియమించి ఇక్కడ నివసించే పేదలకు అండగా నిలవాలని స్థానికులు ప్రభుత్వాన్ని వేడుకొంటున్నారు…..
దీనిపై రాజోలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్ డయానా ను వివరణ కోరగా గైనకాలజిస్ట్ , ఆర్థోపెడిక్ డాక్టర్ల సమస్య ఉందని, దీనిపై జిల్లా కలెక్టర్ కు విన్నవించామని తెలిపారు. నాలుగైదు రోజుల్లో అవుట్ సోర్సింగ్ విధానంలో గైనకాలజిస్ట్ ని ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రాంత పేద ప్రజల మహిళల సమస్యకు పరిష్కారం దొరుకుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అలానే అవుట్ పేషెంట్లకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. చాలా మందికి తెలియక 10 గంటలు దాటిన తర్వాత వస్తున్నారని దాని వల్ల సమయం తగ్గిపోతుందని, ఈ విషయాన్ని అందరూ తప్పనిసరిగా గమనించాలని సూచించారు.






Total views : 80492