తిరుపతి జిల్లాలో మట్కాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. గత 10 ఏళ్లుగా శ్రీకాళహస్తి, తిరుపతి, నగరి, తమిళనాడు సరిహద్దుల్లో మట్కా ఆడిస్తూ వ్యవస్థలను మేనేజ్ చేస్తూ తప్పించుకు తిరుగుతున్న కింగ్పిన్ పద్మనాభంను..ఎట్టకేలకు తిరుపతి పోలీసులు అరెస్టు చేశారు. అతనికి సహకరించిన శ్రీకాళహస్తికి చెందిన ఇద్దరు సీఐలు, నలుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయగా, డీఎస్పీకి చార్జ్ మెమో జారీ చేశారు.
తమిళనాడులోని పళ్లిపట్టుకు చెందిన పద్మనాభం అలియాస్ కుప్పయ్య 10 ఏళ్ల కిందట శ్రీకాళహస్తికి వచ్చాడు. కొందరితో కలిసి ముఠాగా ఏర్పాటై మట్కా, పేకాట మొదలు పెట్టాడు. దీనికి పోలీసుల అండ.. ఒకరిద్దరు నేతల మద్దతూ కూడగట్టుకున్నాడు. వైసీపీ హయాంలో ఓ నేతతో కలిసి తన మట్కా సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరించాడు. మట్కాను అరికట్టాల్సిన పోలీసుల్లో కొందరు అధికారుల నుంచి సిబ్బంది వరకు అండగా నిలబడడంతో అతడికి ఎదురే లేకుండా పోయింది. శ్రీకాళహస్తి కేంద్రంగా దాదాపు 10 ఏళ్లుగా మట్కా నిర్వహిస్తున్నాడు పద్మనాభం. ఈ వ్యవహారం గురించి ఎప్పటి నుంచో అందరికీ తెలిసినా, పట్టించుకోలేదు. మట్కాపై చర్యలు తీసుకోవాలన్న కూటమి ప్రభుత్వం ఆదేశాలతో ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న ఎస్పీ.. ప్రత్యేకంగా దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేసి రహస్యంగా విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ప్రత్యేక పోలీసు బృందం మట్కా కింగ్పిన్ పద్మనాభంను అరెస్ట్ చేశారు. అతడిని విచారించగా సంచలన విషయాలు వెలుగుచూశాయి. మట్కా నిర్వహణలో కొందరు పోలీసు అధికారులు, సిబ్బంది పాత్రపై ఆరోపణలు వినిపించాయి. దీనిపై నిర్దారణకు ఎస్పీ సుబ్బరాయుడు శాఖాపరంగా అంతర్గత విచారణ చేయించారు. ఈ క్రమంలో మట్కా కింగ్పిన్కు పలువురు పోలీసులు సహకరించినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. శ్రీకాళహస్తికి చెందిన ఇద్దరు సీఐలు, నలుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తికి చార్జ్ మెమో జారీ చేశారు. గత పదేళ్లకాలంలో జిల్లాలో పనిచేసిన పలువురు పోలీసు అధికారులతో..పట్టుబడిన కింగ్పిన్ పద్మనాభంకు మంచి సంబంధాలున్నట్టు తెలుస్తోంది. అతడిని అరెస్ట్ చేయడం జిల్లాలోని మట్కా నెట్వర్క్లో మిగిలిన బుకీలు, రైటర్లలో వణుకు పుట్టించినట్లు చర్చ సాగుతోంది.