అయోధ్య రాముడి సొమ్ముపైనే కన్నేశారు. భక్తులు భక్తితో సమర్పించుకున్న కానుకలను అడ్డంగా దోచేశారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కావడంతో యూపీ ప్రభుత్వం ఈ కేసును చాలా సీరియస్గా తీసుకుంది. రామాలయంలో ఇంటి దొంగల పని పట్టేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ను నియమించింది. ఆలయంలో నిందితులు చోరీకి ఎలా పాల్పడ్డారు. ఈ దోపిడీ వెనుక ఇంకెవరెవరి పాత్ర ఉందన్న దానిపై లోతుగా దర్యాప్తు చేపట్టింది. అయితే సిట్ దర్యాప్తులో విస్తుపోయే అంశాలు బయటపడ్డాయి. 2025 ప్రారంభంలో జరిగిన కుంభమేళా సమయాన్నే ఈ దొంగల ముఠా టార్గెట్ చేసుకుంది. కేవలం ఒకరిద్దరు కాకుండా ఈ చోరీ వెనుక ఏకంగా ఓ ముఠానే పనిచేసినట్లు సిట్ గుర్తించింది. ఇప్పటికే అరెస్ట్ అయిన 8 మంది నిందితులను సుదీర్ఘంగా విచారించగా సంచలన విషయాలు బయటపడ్డాయి.
కుంభమేళా సమయంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరగడం.. కానుకలు, విరాళాలు వెల్లువెత్తడంతో.. అదే అదనుగా కోట్లాది రూపాయల నగదును గుట్టుచప్పుడు కాకుండా పక్కదారి పట్టించారు. ఈ మొత్తం కుట్రలో లవకుష్ మిశ్రా, అనుకల్ప్ మిశ్రా అనే బావమరుదుల పాత్ర అత్యంత కీలకంగా మారింది. రాముడి సొమ్మును దొంగిలించి.. వీరు అరడజనుకు పైగా బినామీ ఆస్తులు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. చోరీకి పాల్పడిన సొమ్ముతో ఈ ఇద్దరూ పెద్ద ఎత్తున ఆస్తులు కొనుగోలు చేశారని వీరికి సంబంధించిన అరడజన్కు పైగా ఆస్తులను పోలీసులు ఇప్పటికే గుర్తించారు. నిందితుల ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల వివరాల గుట్టు తేల్చేందుకు మరింత లోతైన దర్యాప్తుకోసం అయోధ్య పోలీసులు ఐటీ డిపార్ట్మెంట్ సహాయం తీసుకుంటున్నారు. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు కోసం ఈడీకి అధికారులు లేఖ రాయనున్నట్లు తెలుస్తోంది.
ఈ కేసును సీరియస్గా తీసుకున్న సిట్ పోలీసులు.. ఇప్పటివరకు అవినాష్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవకుష్ మిశ్రా సహా ఎనిమిది మంది నిందితులను కటకటాల వెనక్కి నెట్టారు. వీరిలో ఆలయ ట్రస్ట్ మాజీ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ వద్ద డ్రైవర్గా పనిచేసిన తిన్ను యాదవ్ కూడా ఉండటం సంచలనంగా మారింది. ఇక రికవరీ సీన్లు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. ప్రధాన నిందితుడు అవినాష్ శుక్లా ఇచ్చిన సమాచారంతో.. జూన్ 5న పోలీసులు ఒక యోగా కేంద్రంపై దాడి చేశారు. అక్కడ నాలుగు బాక్సుల్లోని దుప్పట్ల మధ్య దాచిపెట్టిన ఏకంగా 89 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సొమ్మును అవినాష్ సోదరుడికి చెందిన ఒక యోగా కేంద్రంలో, నాలుగు బాక్సులలోని దుప్పట్ల మధ్య దాచి ఉంచగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రధాన నిందితులైన అనుకల్ప్, లవకుశ్ దొంగిలించిన సొమ్ముతో ఫామ్హౌస్, రూ.65 లక్షల విలువైన ఇల్లు మరియు పలు ప్లాట్లను కొనుగోలు చేసినట్లు నిర్ధారణ అయింది. అంతేకాకుండా, స్కార్పియో వంటి విలాసవంతమైన కారును కొనుగోలు చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. వారి జీవనశైలిలో అకస్మాత్తుగా వచ్చిన మార్పులే పోలీసుల అనుమానాలకు కారణమయ్యాయి. మరోవైపు ఆలయంలోని విరాళాలను లెక్కించే బాధ్యత కలిగిన కొంతమంది SBI సిబ్బంది పాత్రపైన కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రామాలయంలోని నాలుగు డొనేషన్ బాక్సుల నగదును లెక్కించే బాధ్యతను ఎస్బీఐ ఒక ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించగా ఈ బ్యాంకుకు చెందిన 11 మంది సిబ్బంది, ఆలయ ట్రస్ట్కు చెందిన ముగ్గురు మొత్తం 14 మంది సభ్యుల బృందం ఈ లెక్కింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ లెక్కింపు ప్రక్రియలోని లొసుగులని ఆసరాగా చేసుకుని నిందితులు చేతివాటం ప్రదర్శించినట్లు సిట్ అధికారులు చెప్తున్నారు.
మరోవైపు అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయ విరాళాల దుర్వినియోగం కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ పరిధిని పెంచుతూ యోగీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో అన్ని కోణాలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు, దర్యాప్తు పరిధిని మరింత విస్తృతం చేసేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ స్కామ్లో ఎంతటి వారున్నా వదిలిపెట్టేది లేదని, ప్రతి ఒక్క కోణాన్ని నిష్పక్షపాతంగా విచారించనున్నట్లు ఎస్ఐటీ స్పష్టం చేసింది. అలాగే దర్యాప్తు చేస్తున్న సిట్ గడువు ముగియడంతో..మరో మరో 15 రోజుల అదనపు గడువు పొడిగించింది.




Total views : 202967