తమిళనాడు రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు నమోదవుతున్నాయి. ఫలితాల నుంచి కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యేవరకు ఓ ఎత్తు అనుకుంటే ఆ తర్వాత సైతం అనూహ్యమైన పరిణామాలు రాజకీయాన్ని రసవత్తరంగా మారుస్తున్నాయి. ఈ క్రమంలో ఇవాళ మరో సంచలనం చోటు చేసుకుంది. సోమవారం ముగ్గురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తమ పదవికి రాజీనామా చేసి అందరినీ షాక్కు గురి చేశారు. అన్నాడీఎంకేకు చెందిన ఎమ్మెల్యేలు సత్యభామ, మరగాథం, జయకుమార్ కొద్దిసేపటి క్రితం అసెంబ్లీ స్పీకర్ను కలిసి రాజీనామా లేఖలు అందజేశారు.
రాజీనామా అనంతరం టీవీకే మంత్రి ఆదవ్ అర్జునతో భేటీ అయ్యారు. దీంతో వీరు త్వరలో టీవీకేలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. బలపరీక్ష సమయంలో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు విజయ్ టీవీకే పార్టీకి మద్దతు తెలిపారు. అయితే ఈ రాజీనామాలను స్పీకర్ జే.సి.డి. ప్రభాకరన్ ఆమోదిస్తారా? లేక వాటిని పరిశీలనలో ఉంచుతారా? అనే విషయాన్ని త్వరలో ప్రకటించనున్నారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదం పొందితే సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచి ఈస్ట్ నియోజకవర్గంతో పాటు ఈ మూడు స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ పరిణామం వెనుక అసలు వ్యూహం ఏంటనేది రాజకీయవర్గాల్లో చర్చగా మారింది.





Total views : 91182