Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Devotional ప్రపంచంలోనే అతి చిన్న నదీ ద్వీపం

ప్రపంచంలోనే అతి చిన్న నదీ ద్వీపం

by Satya
Smallest river island in the world

అస్సాం రాష్ట్రంలో ఒక అద్భుతమైన ద్వీపం ఉంది. దీని విశేషాలు తప్పకుండా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ప్రపంచంలోనే అతి చిన్న నదీ ద్వీపంగా గుర్తింపు పొందిన ఈ ద్వీపంలో పర్వమేశ్వరుడు తన మూడవ కన్ను తెరిచినట్లు చెబుతారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. అద్భుతమైన ప్రకృతి అందాలను అన్వేషించేందుకు ఈశాన్య భారతదేశం మీకు గొప్ప అవకాశాలను అందిస్తుంది. పచ్చదనంతో నిండిన పర్వతాలు, రాతి మార్గాలు, రంగులతో మెరిసే వాతావరణం, బ్రహ్మపుత్ర నది, దాని సహజ అందాలు మీకు మరచిపోలేని అనుభవాలను పంచుతాయి. ఈ ప్రాంతంలో ప్రకృతి వికాసం అందమైన ఛాయాచిత్రాల మాదిరిగా వైభవంగా కనిపిస్తుంది. ఈశాన్య భారతదేశం అన్ని కాలాల్లో పర్యటించదగ్గ అద్భుతమైన ప్రదేశం. కాబట్టి వింటర్ లో విరామం కోరుకునే వారు ఎక్కడికి వెళ్లాలో ఇప్పటికే అర్ధమైపోయి ఉంటుంది. ఈశాన్య ప్రాంతం సాహసాలకు కూడా స్వర్గధామం వంటిది. ప్రాచుర్యం పెద్దగా లేని కొన్ని అద్భుతమైన రహస్య ప్రదేశాలు ఇక్కడి పర్యాటకంలో ప్రత్యేక ముద్ర వేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది అస్సాంలోని ఉమానంద ద్వీపం. గొప్ప చారిత్రక, పురాణ ప్రాముఖ్యత ఉన్న ఈ ప్రదేశం టూరిస్టుల దృష్టికి దూరంగా ఉంది. వాస్తవానికి ఇది ప్రపంచంలోనే అతి చిన్న నివాస ద్వీపం. ఈ నదీ ద్వీపంలో ఉన్న శివాలయాన్ని సందర్శించేందుకు పెద్ద సంఖ్యలో టూరిస్టులు ఇక్కడికి వస్తుంటారు. అస్సాంలోని కామరూప్ జిల్లాలో ఉన్న 5 ప్రముఖ దేవాలయాల్లో ఇది ఒకటి. కామాఖ్య ఆలయాన్ని సందర్శించడానికి ముందుగా ఈ ఆలయాన్ని సందర్శించాలని భక్తుల నమ్మకం. బ్రిటిషర్లు ఈ ద్వీపాన్ని నెమలి ద్వీపం అని పిలిచేవారు. ఎందుకంటే ఇది నెమలి ఫించాల ఆకారాన్ని పోలి ఉంటుంది. ఎన్నో పురాణ గాధలు కూడా ఈ అరుదైన ప్రదేశం చుట్టూ అల్లుకుని ఉన్నాయి. పురాణ గాధల ప్రకారం ఉమానంద ద్వీపాన్ని ‘భస్మాచల్’ అని కూడా పిలుస్తారు. ఇక్కడే పరమశివుడు కామ దేవుణ్ణి తన మూడవ నేత్రంతో భస్మం చేశాడు. భస్మ అంటే బూడిద, చల్ అంటే స్థలం కామదేవుడు భస్మమైన ప్రదేశం కాబట్టి దీనికి భస్మాచల్ గా పేరు వచ్చినట్లు చెబుతారు. ఈ ద్వీపానికి మరో పురాణ కధనం కూడా ఉంది. పరమేశ్వరుడు తన సతీమణి పార్వతితో కలిసి ఇక్కడ నివాసం ఉండేవాడు. పార్వతి దేవిని ఉమాదేవి అని కూడా పిలుస్తారు. కాబట్టి ఈ ప్రాంతానికి ఉమానంద అని పేరు వచ్చినట్లు చెబుతారు. ఈ ద్వీపం మునిగితే గౌహతి నీట మునుగుతుంది. ప్రసిద్ధ జానపద కధల ప్రకారం బ్రహ్మపుత్రను శివుని సేవకుడిగా పేర్కొంటారు. అస్సాంలో ఇటీవల కాలంలో బ్రహ్మపుత్ర నది కారణంగా అనేక సార్లు వరదలు సంభవించినా ఈ నదిపై ఉన్న ఉమానంద ఆలయంలోకి మాత్రం నీరు చేరలేదు. ఉమానంద ద్వీపం ఎప్పుడు నీట మునుగుతుందో అప్పుడు గౌహతి నగరం కూడా నీట మునుగుతుందని నమ్ముతారు. ఆలయ నిర్మాణం శివ భక్తుడైన గదాధర్ సింఘా అనే రాజు ఇక్కడ శివాలయాన్ని నిర్మించాడు. 1897లో ఏర్పడిన భూకంపానికి ఈ ఆలయం శిధిలమైంది. ఆ తరువాత ఒక స్థానిక వ్యాపారిచే దీనిని పునఃనిర్మాణం జరిగింది. ఈ ఆలయంలో వినాయకుడు, విష్ణువు, సూర్య భగవానుడు, పార్వతీ దేవి విగ్రహాలు ఉంటాయి. ఒక చిన్న కొండ ఎక్కి ఈ ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

013939
Total views : 78571

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.